వరంగల్‌ ఉమ్మడి జిల్లాల వైద్య సేవలపై సమీక్ష..

  • మెరుగైన సదుపాయాలపై మంత్రి దామోదర ఆదేశాలు
  • మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల పనితీరుపై సమగ్ర పరిశీలన

హైదరాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య సేవలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. మంగళవారం సచివాలయంలో ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కే.ఆర్. నాగరాజు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డీఎంహెచ్‌వోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సమీక్షలో భాగంగా జనగామ మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రి, నర్సంపేట మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రి, కాకతీయ మెడికల్ కాలేజీలోని సౌకర్యాలు, ఎంజీఎం ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు.

మూడు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, అవసరమైన వైద్య సిబ్బంది నియామకం, వైద్య పరికరాల లభ్యత, పెండింగ్ అభివృద్ధి పనులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండేలా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.