నాణ్యమైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం

  • ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో అన్ని సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు
  • ఈఎస్ఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం
  • సంగారెడ్డిలో నూతన ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరిస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్‌తో కలిసి మంత్రులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా అన్ని మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఈఎస్ఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే కార్మికులు వైద్య చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో సుమారు 80 లక్షల కుటుంబాలు ఈఎస్ఐ వైద్య సేవలపై ఆధారపడుతున్నాయని, ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఇటీవల ఆర్‌సీ పురం ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించినప్పుడు కొన్ని ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు సనత్‌నగర్‌కు వెళ్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వచ్చే ఆరు నెలల్లో అక్కడ అన్ని ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, కార్మికులు స్థానికంగానే పూర్తి స్థాయి చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

త్వరలో ఆర్‌సీ పురం ఈఎస్ఐ ఆసుపత్రిలో 20 పడకల డయాలసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఏడాదిలో కార్డియాలజీ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే శంషాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక భారం మోసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ కార్మికులు ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటికే ఏడు ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా, సంగారెడ్డిలో ఎనిమిదో డిస్పెన్సరీని ప్రారంభించడం సంతోషకరమన్నారు.

రూ.200 కోట్లతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట, ఆందోల్, జోగిపేట ప్రాంతాల ప్రజలకు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఈఎన్‌టీ, క్యాన్సర్ చికిత్స, ట్రామా కేర్, నేత్ర వైద్య సేవలు వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పీజీ సీట్లను కూడా కేటాయించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని 104 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుతూ వైద్య సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల ఆధునిక వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో కార్మికుల వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

మరిన్ని మౌలిక వసతులను కల్పించాలి

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ మాట్లాడుతూ.. సంగారెడ్డి రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జిల్లాగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వేలాది మంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత వైద్య మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈఎస్ఐ వైద్య సేవల విస్తరణ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తున్న డాక్టర్ గౌతమ్ సేవలను మంత్రులు అభినందించారు.

కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు వనిత సంతోష్, అంజమ్మ సత్యనారాయణ, డాక్టర్ పద్మజ, వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.