హైదరాబాద్, ఆంధ్రప్రభ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోనే దమ్ము, ధైర్యం లేక కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రధాని నరేంద్ర మోడీ దొంగ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. బ్రిటీష్ వాళ్లకే భయపడని కాంగ్రెస్ నిఖార్సైన లీడర్లు మోడీకి భయపడతారని అనుకోవడం వాళ్ల ముర్ఖత్వమేనని కామెంట్ చేశారు. తమ అధినాయకులపై కుట్రలు చేస్తున్న నరేంద్ర మోడీ , అమిత్ షా లు పెద్ద కేడీలు అంటూ మండిపడ్డారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంపై కక్ష
దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం అన్యాయంగా కక్షగట్టారని దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సంగ్రామంలో బీజేపీ నాయకుల పాత్ర ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. సెంటు భూమి, సొంత ఇల్లు కూడా లేని రాహుల్, సోనియాలపై కుట్రలు చేస్తే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వాదుల ఏకమవుతారు.. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. 2029లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను తన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. దేశ ప్రతిపక్ష నాయకుడి రాజకీయాల నుంచి టర్మినేట్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశంలో బీజేపీ నాయకులు విద్వేషాన్ని రేపుతుంటే.. తమ నాయకులు రాహుల్ గాంధీ ప్రేమను పంచుతున్నాడని.. అది కాంగ్రెస్ పార్టీ విధానమని. దేశంలో జరుగుతోన్న అక్రమాలను ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే.. వారిపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్న మోడీని పాతాళంలోకి తొక్కేస్తామని అద్దంకి దయాకర్ అన్నారు.