171 Years Prakasam Barrage : కృష్ఱమ్మ వజ్ర సౌధం Andhra Prabha Top Story

171 Years Prakasam Barrage : కృష్ఱమ్మ వజ్ర సౌధం Andhra Prabha Top Story
- శతాబ్దాల చరితకు ప్రత్యక్ష సాక్ష్యం
- ప్రపంచ వారసత్వ జాబితాలో ప్రకాశం బ్యారేజీ
- సస్యశ్యామలం క్రతువుకు ప్రతిరూపం
- లక్షల ఎకరాలకు జీవనాధారం
- ఇంజనీరింగ్ అద్భుతం..
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో)

కరువు నేలలను సస్యశ్యామలం చేసిన జలసౌధం.. లక్షలాది ఎకరాలకు జీవనాధారం.. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా ప్రకాశం బ్యారేజీ తరతరాలుగా నిలుస్తోంది. ఇంజనీరింగ్ అద్భుతంతో రైతు జీవన విధానాన్ని మార్చిన ఈ కట్టడం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. పర్యాటక సౌరభంతో వెలుగొందుతున్న ప్రకాశం బ్యారేజీ విజయవాడ సిగలో కీర్తి కిరీటంగా నిలిచింది.
171 Years Prakasam Barrage : అరుదైన గౌరవం..

ప్రకాశం బ్యారేజీ మరోసారి ప్రపంచ వేదికపై గర్వంగా నిలిచింది. కృష్ణానది ఒడ్డున విజయవాడ నగరానికి ప్రతీకగా వెలుగొందుతున్న ఈ శతాబ్దాల చరితకు అరుదైన రూపం ప్రపంచ వారసత్వ జాబితాలో ప్రకాశం బ్యారేజీ కరువు నేలలను సస్యశ్యామలం చేసిన కృష్ణా జలసౌధం.. ఇంజినీరింగ్ అద్భుతం.. రైతు జీవన విధానాన్ని మార్చిన నిర్మాణం లక్షల ఎకరాలకు జీవనాధారం చారిత్రక జల నిర్మాణానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ సాగునీటి డ్రైనేజ్ కమిషన్ 2023 సంవత్సరానికి ప్రకాశం బ్యారేజీని వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ (డబ్ల్యూహెచ్ ఐఎస్)గా ప్రకటించడం రాష్ట్రానికే కాక దేశానికి గర్వకారణంగా నిలిచింది. శతాబ్దాల చరిత్రను మోస్తూ, కోట్లాది మంది రైతుల జీవన విధానాన్ని మార్చిన ఈ నిర్మాణం కేవలం ఆనకట్ట మాత్రమే కాదు… ఒక ప్రాంత ఆర్థిక, సామాజిక, వ్యవసాయ సంస్కృతిని మలిచిన జీవనాధారంగా మారింది.
171 Years Prakasam Barrage : కరువుపై విజయం .

19వ శతాబ్ద ప్రారంభంలో కృష్ణా డెల్టా ప్రాంతం తీవ్ర కరువులతో విలవిల్లాడింది. ముఖ్యంగా 1832-33 మధ్య సంభవించిన “డొక్కల కరువు” ప్రజలను ఆకలి కష్టాల్లోకి నెట్టింది. అయితే అదే సమయంలో ఎడతెరిపి లేకుండా ప్రవహించే కృష్ణానది బ్రిటిష్ ఇంజినీర్ల దృష్టిని ఆకర్షించింది. నీటిని నిల్వ చేసి సాగునీటికి మళ్లిస్తే ఈ ప్రాంత భవిష్యత్తు మారుతుందని వారు భావించారు. 1798లో కెప్టెన్ బకిల్ విజయవాడ సమీపంలో ఆనకట్ట నిర్మాణ ఆలోచనను ప్రతిపాదించగా, అనంతరం ప్రసిద్ధ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ చొరవతో 1852లో పాత కృష్ణా ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. 1855లో అది పూర్తయ్యి దక్షిణ భారత వ్యవసాయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
171 Years Prakasam Barrage : 1954లో ఆధునిక బ్యారేజీ నిర్మాణం..

కాలక్రమంలో పాత ఆనకట్ట బలహీనపడడంతో ఆధునిక నిర్మాణ అవసరం ఏర్పడింది. 1954 ఫిబ్రవరి 13న కొత్త బ్యారేజి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో కేవలం మూడున్నర సంవత్సరాల్లోనే పనులను పూర్తి చేసి 1957 డిసెంబర్ 24న నీటిని విడుదల చేశారు. అప్పటి విలువ ప్రకారం రూ.2.278 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు, ఆ కాలంలోనే దేశంలోని అత్యుత్తమ జల నిర్మాణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గౌరవార్థం దీనికి “ప్రకాశం బ్యారేజి”గా పేరు పెట్టారు. సుమారు 1,223.5 మీటర్ల పొడవుతో నిర్మితమైన ఈ బ్యారేజి నేడు సాగునీటి వనరుగా మాత్రమే కాకుండా విజయవాడ నగరానికి గుర్తింపుగా, పర్యాటక ఆకర్షణగా, రవాణా మార్గంగా కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
171 Years Prakasam Barrage : లక్షల ఎకరాలకు జలధారం
ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 12 నుంచి 13 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు ఈ బ్యారేజి ద్వారా సాగునీరు అందుతోంది. ఒకప్పుడు కరువుతో వణికిన నేలను దేశంలోనే అత్యంత సస్యశ్యామల ప్రాంతాల్లో ఒకటిగా మార్చడంలో ప్రకాశం బ్యారేజి పాత్ర అపారమైంది. రైతు జీవితాల్లో వెలుగులు నింపిన ఈ నిర్మాణం వల్లే కృష్ణా డెల్టా ప్రాంతం “అన్నపూర్ణ”గా ప్రసిద్ధి చెందిందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
171 Years Prakasam Barrage : ప్రపంచ గుర్తింపు
ఐసీఐడీ నుంచి వచ్చిన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ గుర్తింపు కేవలం ఒక నిర్మాణానికి దక్కిన గౌరవం మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ జలసంస్కృతికి, రైతు కృషికి, భారత ఇంజినీరింగ్ ప్రతిభకు ప్రపంచం తెలిపిన ప్రశంసగా భావిస్తున్నారు. అన్నింటికీ సమాహారంగా ఉన్న ప్రకాశం బ్యారేజీ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి బెజవాడ ఖ్యాతిని మరోసారి ప్రపంచ వ్యాప్తి చేసింది.
ALSO READ : Rs 433 Crore Burden : పెట్రో వాత Andhra Prabha Top Story
