Panama Canal Traffic : వ‌యా ప‌నామా Andhra Prabha Top News

Panama Canal Traffic : వ‌యా ప‌నామా Andhra Prabha Top News

  • మ‌హా ప్రియం గురూ
  • టోల్‌..ఓడ‌కు రూ.3.6 కోట్లే
  • భారత్​ ఆయిల్​ అవస్థలు
  • అమెరికా ఇరాన్​ చెరలో హోర్ముజ్​ జలసంధి

(ఆంధ్ర‌ప్ర‌భ‌, వాషింగ్ట‌న్ ప్ర‌తినిధి )

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే త‌మ‌ జలమార్గం గుండా అక్టోబర్ నుంచి సుమారు 300 అదనపు నౌకలు ప్రయాణించాయని పనామా కాలువ అథారిటీ ఆర్థిక విభాగం అధిపతి తెలిపారు.

“మధ్యప్రాచ్యంలో పరిస్థితి చక్కబడే వరకు ఈ జ‌ల‌మార్గంలో ర‌వాణా కొనసాగుతుందని పనామా కాలువ అథారిటీ ఆర్థిక విభాగం అధిపతి విక్టర్ వియల్ అన్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ఈ రద్దీ పెరిగింది. ఇరాన్ తీరంలోని ఈ జలమార్గాన్ని తప్పించుకోవడానికి, దారి మళ్లించిన నౌక‌లు, ఇతర దేశాల సరుకులను చేర‌వేసే వాణిజ్య నౌకలు పనామా కాలువ గుండా తీసుకువెళ్తున్నాయి. నౌకను బట్టి, ఈ కాలువ గుండా ప్రయాణించడానికి సగటు ధర $300,000 నుండి $400,000 (రూ.3.6 కోట్లు) మధ్య ఉంటుంది. చివరి నిమిషంలో ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి కొన్ని నౌకలు $425,000 వరకు అదనపు రుసుము చెల్లిస్తున్నాయి.

Panama Canal Traffic : భార‌త్ కు ఆయిల్ అవ‌స్థ‌లు

హోర్ముజ్ జలసంధి సంక్షోభంతో ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సుమారు 2,000 నౌకలు, సుమారు 20,000 మంది నావికులు చిక్కుకుపోయినట్లు అంచనా. అమెరికా-ఇరాన్ పోటాపోటీగా ఈ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ప్రస్తుతం 14 భారతీయ నౌకలు చిక్కుకున్నాయి. వీటిలో ప్రధానంగా క్రూడాయిల్ ట్యాంకర్లు, ఎల్‌పిజి (LPG), ఎల్‌ఎన్‌జి (LNG) వాహకాలు ఉన్నాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపిన ప్రకారం, గత కొన్ని వారాల్లో 10 భారతీయ నౌకలు హోర్ముజ్ జలసంధి నుండి సురక్షితంగా బయటపడ్డాయి. యుద్ధం ఆరంభం నుంచి ఈ ప్రాంతంలో దాదాపు 28 భారతీయ నౌకలు ఉండగా, దౌత్యపర చర్చలతో కొన్నింటిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారు. విదేశీ నౌకలు: భారత్‌కు ఇంధనాన్ని మోసుకొస్తున్న మరో 10 విదేశీ నౌకలు కూడా పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయాయి.

భారత ప్రభుత్వం తమ నౌకలు సిబ్బంది భద్రత కోసం ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. హోర్ముజ్ జలసంధిలో భారతీయ నౌకలపై కొన్ని కాల్పుల ఘటనలు జరిగినప్పటికీ, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ సంక్షోభంతోనే భారత్‌కు ఇంధన సరఫరాలో జాప్యం జరుగుతోంది బీమా ఖర్చులు (Insurance Premiums) గణనీయంగా పెరిగాయి