cgwb workshop : ఏఐతో గ్రౌండ్ వాటర్ అంచనాలు !

cgwb workshop : ఏఐతో గ్రౌండ్ వాటర్ అంచనాలు !
- 601 అసెస్మెంట్ యూనిట్లు సురక్షితం – తాజా నివేదిక
- అతి వినియోగం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి అవసరం
- భూగర్భ జల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ
- రియల్ టైమ్ మానిటరింగ్తో ముందడుగు
- డేటా ఆధారిత దీర్ఘకాలిక నీటి భద్రత లక్ష్యం
( ఆంధ్రప్రభ. ఎన్టీఆర్ బ్యూరో)
cgwb workshop : భూగర్భజల వనరుల అంచనా, సమర్థ నిర్వహణ, వినియోగానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతిక పద్ధతులను విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) సభ్యులు ఎన్.వరదరాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలాల రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.. ద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సీజీడబ్ల్యూబీ) ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని హోటల్ వివాంతాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భూగర్భ జలాల డేటా, ఆక్విఫర్ (జలధార పొరలు) మ్యాపింగ్ ఫలితాల ప్రచారంపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ కార్యశాలలో 150 మందికిపైగా జిల్లా, రాష్ట్రస్థాయి సమన్వయ శాఖల అధికారులు, భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.

cgwb-workshop : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్-2025, నేషనల్ ఆక్విఫర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ((NAQUIM 1.0, 2.0) నివేదికలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సభ్యులు (ఇంజనీరింగ్) ఎన్.వరదరాజ్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, వర్షపాతంలో లోపాలు, అధిక వినియోగం వంటి కారణాలతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శాస్త్రీయ ఆధారిత డేటా సేకరణ, విశ్లేషణ అత్యంత అవసరమన్నారు. మనం ఎంత కచ్చితంగా కొలిస్తే, అంచనాలు అంత కచ్చితంగా ఉంటాయని.. అప్పుడు భూగర్బ జలాల నిర్వహణ ప్రణాళిక కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో భూగర్భ జల రంగంలో సాంకేతికతను ఉపయోగించుకోవాల్సిన అవసరముందని.. ఏఐ ఆధారిత నమూనాలు ద్వారా భూగర్భ జలాల నిల్వలు, రీఛార్జ్ సామర్థ్యం, వినియోగ ధోరణులు తదితర అంశాలను ముందస్తుగా కచ్చితత్వంతో అంచనా వేయవచ్చని తెలిపారు.

cgwb-workshop: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళికలు రూపొందించుకోవడానికి కూడా ఇది ఉపయోగపకరంగా ఉంటుందన్నారు. “ఇన్-గ్రెస్” సాఫ్ట్వేర్ వినియోగం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా ఆటోమేటిక్ వాటర్ లెవల్ మానిటరింగ్కు మారుతున్నామని.. డిజిటల్ రికార్డులు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో భూగర్భ జలాల వనరుల అంచనా పదేళ్లకోసారి, ఆ తర్వాత ఐదేళ్లకు ఒకసారి, రెండేళ్లకు ఒకసారి చేసేవారు.. కానీ, ఇప్పుడు ఏటా చేస్తున్నారని.. అయితే ఈ డేటా నిర్వహణ, విశ్లేషణ అతిపెద్ద సవాల్ అని.. సాంకేతికత సహాయంతో దీన్ని అధిగమించవచ్చని పేర్కొన్నారు.
cgwb-workshop : సురక్షితంగా 601 యూనిట్లు:
నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు 2012లో ప్రారంభమైన నేషనల్ ఆక్విఫర్ మ్యాపింగ్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో 1.46 లక్షల చ.కి.మీ. ప్రాంతంలో మ్యాపింగ్ పూర్తయినట్లు వివరించారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 679 అసెస్మెంట్ యూనిట్ల (మండలాలు)లో 601 యూనిట్లు సురక్షితంగా ఉన్నాయని.. 12 యూనిట్లు అతి వినియోగం కేటగిరీలోనూ, మూడు యూనిట్లు క్రిటికల్ కేటగిరీ, 24 యూనిట్లు సెమీ క్రిటికల్ కేటగిరీలో ఉన్నట్లు వివరించారు. మొత్తంమీద చూస్తే రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి సురక్షితంగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలిక స్థిరత్వానికి అతి వినియోగం, క్రిటికల్, సెమీ క్రిటికల్ కేటగిరీ ప్రాంతాల్లో సంరక్షణపై దృష్టిసారించాల్సిన అవసరముందని నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు వివరించారు.
cgwb-workshop: నాణ్యతా ముఖ్యం:
భూగర్భ జలాల పరిమాణంతో పాటు నాణ్యతపైనా ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని.. ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి కాలుష్య సమస్యలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సీజీడబ్ల్యూబీ రీజనల్ డైరెక్టర్ (ఏపీ అండ్ తెలంగాణ) కేఎన్.జ్యోతికుమార్ అన్నారు. సమృద్ధిగా నాణ్యమైన భూగర్భ జల వనరులను భవిష్యత్ తరాలకు అందించాలంటే ప్రజల్లో అవగాహనతో పాటు కలిసికట్టుగా అడుగులేయాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, డేటా ఆధారిత ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రతను సాధించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

cgwb-workshop: భూగర్భ జలాలతో సహా నీటి వనరులు, సాంకేతికతల్లో సవాళ్లతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి ఆక్విఫర్ మ్యాపింగ్, మేనేజ్మెంట్ ప్రణాళికలు, భూగర్భ జలవనరుల అభివృద్ధి, పర్యవేక్షణ నియంత్రణలు, ఫ్రేమ్వర్క్లపై నిపుణుల ప్రజంటేషన్ భావి ప్రణాళికలకు దోహదం చేస్తాయని వివరించారు.గౌరవ సీఎం మార్గనిర్దేశనంతో ముందడుగు: కేఎస్ శాస్త్రి, డైరెక్టర్, ఏపీ గ్రౌండ్ వాటర్, వాటర్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్, వాటర్ ఆడిట్ డిపార్టుమెంట్ డైరెక్టర్ కేఎస్ శాస్త్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో రాష్ట్రంలో 1,800 కు పైగా పీజియోమీటర్ల సహాయంతో రియల్ టైమ్ డేటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. డేటా సమర్థ వినియోగంతో భూగర్బ జలాల పరిరక్షణ, వినియోగ ప్రణాళికల రూపకల్పనకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. డేటా షేరింగ్, డేటా నెట్వర్క్ విషయంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ తో కలిసి పనిచేయడం వల్ల మరింత సునిశిత డేటాను పొందడానికి, మరింత సమర్థవంతంగా ప్రణాళికలు అమలుచేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
cgwb-workshop : ముగింపు సెషన్కు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియా సరెల్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రసంగం చేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ, సుస్థిర వినియోగం, సమర్థ నిర్వహణపై వర్క్షాప్లో నిపుణుల సూచనలు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని.. ఏ ఒక్క వ్యక్తో, ఒక్క విభాగమో కాకుండా సమష్టిగా కృషిచేస్తేనే విలువైన జలసిరులను భావితరాలకు బహుమతిగా అందించగలుగుతామనే ఈ కార్యశాల సందేశం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీజీడబ్ల్యూబీ (బెంగళూరు) రీజనల్ డైరెక్టర్ జి.కృష్ణమూర్తి, సీజీడబ్ల్యూబీ శాస్త్రవేత్తలు డా. పండిత్ మధునూర్, టి.మధు, పి.యాదయ్య, డా. ఎస్ఎస్ విట్టల, రేష్మా పిళ్లై, డా. అనంతరావు, జి.ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
