Dmac | జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు పంపిణీ

Dmac | జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు పంపిణీ
జీవోఎంఎస్ నెం.84 ప్రకారం జిల్లాలో తొలి విడత 742 కార్డుల జారీ..
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
Dmac | విజయవాడ, ఆంధ్రప్రభః ప్రభుత్వ నిబంధనలను అనుసరించి జిల్లాలో అర్హత ప్రమాణాలున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని, తొలి విడత 742 కార్డులను జారీచేసి, పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ (డీఎంఏసీ) ఛైర్మన్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీశ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు మంజూరైన అక్రెడిటేషన్ కార్డులు పంపిణీ చేశారు.
జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితి పూర్తయినందున నూతన అక్రెడిటేషన్ కార్డుల మంజూరుకు జీవోఎంఎస్ నెం.84లోని నిబంధనలు, మార్గదర్శకాల మేరకు జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అక్రెడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం తొలి విడతగా 742 అక్రెడిటేషన్ కార్డులు జారీకి డీఎంఏసీ ఆమోదం తెలిపిందన్నారు. అక్రెడిటేషన్ మంజూరైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులను పంపణీ చేస్తున్నామని 2027, డిసెంబర్ వరకు అమల్లో ఉంటాయన్నారు.
ప్రతి దరఖాస్తును నిష్పాక్షికంగా పారదర్శకంగా పరిశీలించి, అర్హత ఉన్న వారికి కార్డులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరలోనే తదుపరి విడతలో కార్డులు జారీచేస్తామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను చేరవేయడంలో మీడియా పాత్ర కీలకమైందన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వ యంత్రాంగానికి సూచనలు సలహాలు అందిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవడంలో పారదర్శకమైన సేవలు అందించడంలో సహకరించాలని ఈ సందర్బంగా కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో డీఐపీఆర్వో కేవీ రమణరావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, ఆడియో విజువల్ పర్యవేక్షకులు వి.వి.ప్రసాద్, డీమ్యాక్ సభ్యులు, ఉప కార్మిక కమిషనర్ జి.ధనలక్ష్మి, పి.నాగమల్లేశ్వరరావు, కలిమిశ్రీ, యామినేని వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
