- అట్టహాసంగా ప్రారంభమైన అందాల పోటీలు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభమయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలలో 109 మంది పోటీదారులు పాల్గొంటున్నారు. “బ్యూటీ విత్ ఎ పర్పస్” అనే థీమ్ తో సామాజిక కారణాలను హైలైట్ చేస్తూ ఈ కిరీటం కోసం పోటీపడుతున్నారు.
భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, గచ్చిబౌలిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ”తో ప్రారంభమైంది. ఆ తరువాత అద్భుతమైన పెరిని నృత్య ప్రదర్శన జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి. పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
భారతదేశం ఈ ప్రసిద్ధ అందాల పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 71వ మిస్ వరల్డ్ ఎడిషన్ గత సంవత్సరం 2024 ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ పోటీ భారత్ లో తొలిసారిగా 28 సంవత్సరాల క్రితం 1996లో బెంగళూరులో జరిగింది.
భారీ బందోబస్తు !
మిస్ వరల్డ్ అందాల పోటీలకు భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. దాదాపు 5 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
గచ్చిబౌలి స్టేడియంలో సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేశారు. మల్టీ-ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భద్రతను సమీక్షిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో పోలీసు షార్ప్ షూటర్లు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.