322 people | ఎవ‌రెస్ట్‌పై.. మృత్యుకుహ‌రం

322 people | ఎవ‌రెస్ట్‌పై.. మృత్యుకుహ‌రం

322 people | ప‌ర్వాతారోహ‌కుల పాలిట‌ డెత్ జోన్
అక్క‌డి వెళితే మ‌ర‌ణం వైపు వెళ్లిన‌ట్లే
8,849 మీటర్ల ఎత్తులో డేంజ‌ర్ బెల్స్
ప్ర‌తి ఏడాది నలుగురికి పైగా మృత్యువాత‌
మృత‌దేహాల‌ను కింద‌కు తీసుకురావ‌డ‌మూ క‌ష్టమే
ఒక్కొ పార్థీవ దేహాన్ని తెచ్చేందుకు కోటికి పైగా ఖ‌ర్చు
మంచుకొండ‌పైనే హైద‌రాబాదీ మృత‌దేహం ఖ‌న‌నం

322 people | న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌పంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్వతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే ఆశతో ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు అక్కడికి తరలివస్తారు. విచారకరంగా, వారందరూ తిరిగి రాలేరు. 8,849 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు వాతావరణం అనుకూలించదు, కొన్నిసార్లు అధిరోహకులు గాయపడతారు, చాలాసార్లు ఆక్సిజన్ కొరత ఉంటుంది. ఎవరెస్ట్‌పై, పరిస్థితి ఎప్పుడూ జీవన్మరణ సమస్యే. 1922లో రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి మౌంట్ ఎవరెస్ట్ పర్వతంపై కనీసం 322 మంది మరణించారు, ఇది సంవత్సరానికి సగటున 4.4 మరణాలకు సమానం. ఆ సంఖ్య ప్రతి సంవత్సరం నెమ్మదిగా పెరుగుతోంది.
1953లో తొలిసారిగా..
1953లో ఆ పర్వత శిఖరాన్ని మొదటిసారిగా అధిరోహించారు. అంటే, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్కడ నలుగురు నుంచి ఐదుగురు మరణిస్తున్నారన్నమాట. కానీ, వాస్తవానికి, 1990లలో వాణిజ్య యాత్రలు ప్రారంభమయ్యే వరకు ఆ పర్వతాన్ని అధిరోహించడానికి ఎక్కువ మంది ప్రయత్నించలేదు. అత్యంత ఘోరమైన రోజు 2015 ఏప్రిల్ 25న సంభవించింది. 7.8 తీవ్రత గల భూకంపం కారణంగా బేస్ క్యాంప్‌లో 19 మంది మరణించారు. మరో విషాదకరమైన రోజు 2014 ఏప్రిల్ 14న జరిగింది, ఆ రోజు హిమపాతం సంభవించి 16 మంది నేపాలీ పర్వతారోహణ గైడ్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు వినాశకరమైన రోజులు చరిత్రలో నిలిచిపోయాయి.

డేత్ జోన్ లోనే మ‌ర‌ణాలు
ఎవరెస్ట్ పర్వతంలో 8 వేల మీటర్ల సుమారు 26,000 అడుగులు ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని ‘డెత్ జోన్’గా పరిగణిస్తారు…ఇక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి… వాస్తవానికి పర్వతారోహకులు శిఖరాన్ని అధిరోహించే సమయానికి పూర్తిగా అలసిపోతారు…సిలిండర్లలో తెచ్చుకున్న ఆక్సిజన్ కూడా అయిపోతుంటుంది..ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గైడ్ మాట విని వెనక్కి రాకుండా, ‘ఏదైతే అది అయింది’ అని ముందుకు వెళ్లడం ప్రాణాంతకంగా మారుతుంది…

శరీరంపై తీవ్ర ప్రభావం
డెత్ జోన్‌లో గాలిలో ఆక్సిజన్ స్థాయి సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం మూడో వంతు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ‘హైపోక్సియా’ (ఆక్సిజన్ కొరత) ఏర్పడి, మొదట మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో గందరగోళం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, భ్రాంతులు కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సప్లిమెంటరీ ఆక్సిజన్ లేకుండా శిఖరంపైకి చేరితే, కేవలం 4 నిమిషాల్లో స్పృహ కోల్పోయి, 6 నిమిషాల్లో మరణం సంభవిస్తుంది. దీంతోపాటు మెదడు వాపు , ఊపిరితిత్తులలో నీరు చేరడం వంటి ప్రాణాంతక సమస్యలు కూడా తలెత్తుతాయి. శరీరం తనను తానే తినేస్తూ, కండరాలు బలహీనపడతాయి.

పెరుగుతున్న రద్దీ.. ప్రాణాలకు ముప్పు
ఇటీవల కాలంలో ఎవరెస్ట్‌పై రద్దీ విపరీతంగా పెరిగిపోవడం మరణాలకు మరో ప్రధాన కారణంగా మారింది. ఈ సీజన్‌లో నేపాల్ వైపు నుంచి ఒకేరోజు 274 మంది శిఖరాన్ని చేరుకున్నారు. ఈ రద్దీ వల్ల ప్రమాదకరమైన హిల్లరీ స్టెప్ వంటి ప్రాంతాల్లో గంటల తరబడి నిల్చోవాల్సి వస్తోంది. మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఇలా నిరీక్షించడం వల్ల శరీరం చల్లబడిపోవడమే కాకుండా, వెంట తెచ్చుకున్న ఆక్సిజన్ నిల్వలు కూడా వేగంగా అయిపోతున్నాయి.

ఎక్కడం కన్నా దిగడమే అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శిఖరాన్ని చేరుకునేసరికే శక్తి మొత్తం అయిపోవడంతో, తిరుగు ప్రయాణంలో నీరసం, ఆక్సిజన్ కొరత కారణంగా చాలామంది కుప్పకూలుతున్నారు. ఈ ఏడాది (2026) సీజన్‌లో ఇద్దరు భారతీయ పర్వతారోహకులతో సహా కనీసం ఐదుగురు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మరణించిన ఇద్దరు భారతీయులు కూడా శిఖరాన్ని అధిరోహించి, కిందకు దిగివస్తుండగా ప్రాణాలు విడిచారు.

మృత‌దేహం త‌ర‌లింపుకు రూ. కోటి ఖ‌ర్చు
మృతదేహాల తరలింపు కూడా ఒక సవాలే అని చెప్పాలి…క్యాంప్-2 లేదా అంతకంటే పైనున్న ప్రాంతాల నుంచి మృతదేహాలను కిందికి తీసుకురావడం అత్యంత కష్టం…వాతావరణం సహకరించకపోవడం, హెలికాప్టర్లు అన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోవడం దీనికి ప్రధాన కారణాలు…కేవలం ఎయిర్‌లిఫ్ట్ ద్వారా మాత్రమే కొన్నిచోట్ల సాధ్యమవుతుంది…ఒక మృతదేహాన్ని పర్వతం పైనుంచి సురక్షితంగా కిందికి తరలించడానికి సుమారు కోటి పైగా ఖర్చవుతుంది…ఈ విపరీతమైన ఖర్చులు, భౌగోళిక సవాళ్ల కారణంగా చాలామంది తమ వారి మృతదేహాలను ఎవరెస్ట్‌పైనే వదిలేస్తుంటారు… కాలక్రమేణా ఎవరెస్ట్ శిఖరానికి వెళ్లే దారిలో ఇవి ‘ల్యాండ్‌మార్క్‌లు’గా మారిపోయాయి…ఉదాహరణకు గ్రీన్ బూట్స్, స్లీపింగ్ బ్యూటీ వంటి పేర్లతో వీటిని పిలుస్తుంటారు…ఎవరెస్ట్ అధిరోహించాలనుకునే వారికి సరైన శారీరక శిక్షణతో పాటు విషయ పరిజ్ఞానం కూడా ఉండాలి. ప్రయాణించే కంపెనీ, గైడ్‌లతో పాటు సరైన ట్రావెల్/లైఫ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం చాలా ముఖ్యం..

హైద‌రాబాదీ మృత‌దేహం అక్క‌డే
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో అక్కడకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) విషాదాంతం అందరినీ కలచివేస్తోంది. ఆయన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినప్పటికీ, తిరిగి వస్తుండగా ‘డెత్ జోన్’గా పిలిచే 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ప్రాణాలు కోల్పోయారు. హిల్లరీ స్టెప్ సమీపంలో రక్తపు వాంతులతో అరుణ్ కుమార్ కుప్పకూలిపోగా, ఆయనతో ఉన్న షెర్పాలు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడి విపరీతమైన చలి, అత్యంత ప్రమాదకర పరిస్థితుల కారణంగా ఆయన మృతదేహాన్ని ప్రస్తుతానికి అక్కడే వదిలివేయాల్సి వచ్చింది. అరుణ్ కుమార్ మృతదేహాన్ని కిందకు తీసుకురావడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.

90 ల‌క్ష‌ల ఇస్తే తెస్తాం..
పయనీర్ అడ్వెంచర్ అనే సంస్థ ఈ మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడానికి మొదట రూ. 1.1 కోట్లు కోట్ చేయగా, ఆ తర్వాత రాయితీతో రూ. 89.7 లక్షలు అవుతుందని తెలిపింది. 8,000 మీటర్ల ఎత్తులో, మంచులో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీసి కిందకు తీసుకురావాలంటే దాదాపు 8 నుంచి 10 మంది షెర్పాలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం హెలికాప్టర్ ద్వారా చేసే రెస్క్యూ ఆపరేషన్లకు మాత్రమే నిధులు ఇస్తాయి తప్ప, ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన మాన్యువల్ రికవరీలకు నిధులు కేటాయించవని సదరు సంస్థ స్పష్టం చేసింది.

ఖ‌ర్చు భ‌రించ లేక‌..
ఈ పరిస్థితులు, భారీ ఖర్చు, ఇతరుల ప్రాణాలకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని అరుణ్ కుమార్ తివారీ కుటుంబ సభ్యులు భావోద్వేగ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన మృతదేహాన్ని వెనక్కి తీసుకురావద్దని వారు నిర్ణయించుకున్నారు. ‘హిమాలయాలు పవిత్రమైన దైవభూమి. అక్కడ మరణించడం అంటే వైకుంఠ ప్రాప్తి లభించడమే. ఆ పవిత్ర స్థలమే ఆయనకు చిరకాల నివాసం. హిమాలయాల్లో ఆయన ఇప్పుడు ఆ పరమశివునిలో భాగమయ్యారు’ అని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

click here to read సెక్స్ వర్కర్లుగా మారడం.. నేరం కాదు

click here to read more

Leave a Reply