31 ఏళ్లుగా విడదీయరాని స్నేహబంధం
మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆత్మీయ అనుబంధం
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: స్నేహానికి వయసుతో సంబంధం లేదని, నిజమైన స్నేహం కాలం గడిచే కొద్దీ మరింత బలపడుతుందని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు నిరూపిస్తున్నారు.
సునార్కని నర్సింహారావు, గాంధేర్ల సమ్మయ్య, చింతగూడెం గ్రామానికి చెందిన దుర్గం రాజు 1995 నుంచి ఇప్పటివరకు ఎలాంటి మనస్పర్థలు లేకుండా తమ స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు.
ముగ్గురిలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మిగతా ఇద్దరూ అండగా నిలుస్తూ సహాయం చేస్తున్నారు. నర్సింహారావు ఖమ్మంలో వైద్య రంగంలో స్థిరపడగా, సమ్మయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. దుర్గం రాజు వ్యవసాయంతో పాటు జర్నలిస్టుగా కొనసాగుతున్నారు.
ఇటీవల రాష్ట్ర మంత్రి సీతక్కను ముగ్గురు స్నేహితులు కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న వారి స్నేహబంధాన్ని చూసి గ్రామస్థులు అభినందిస్తున్నారు.
నేటి తరానికి వీరి స్నేహం ఆదర్శంగా నిలుస్తోందని పలువురు పేర్కొన్నారు.
