ఆంధ్రప్రభ కథనంతో స్పందించిన అధికారులు
వేల్పూర్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. “85 ఏళ్ల వృద్ధుడి ఆక్రందన.. ఆదుకునే వారి కోసం ఎదురుచూపు” అనే కథనం వెలువడిన వెంటనే పోలీసులు చొరవ తీసుకుని అనాథగా ఉన్న వృద్ధుడికి అండగా నిలిచారు.
వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామ సొసైటీ ఆవరణలో ఒంటరిగా జీవిస్తున్న 85 ఏళ్ల చంద్రయ్య అలియాస్ రాజన్నను వేల్పూర్ ఎస్సై సంజీవ్ మంగళవారం స్వయంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆయనను రాంపూర్ (డి), డిచ్పల్లి మండలంలోని వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రయ్య కొంతకాలంగా భిక్షాటన చేస్తూ సొసైటీ ఆవరణలో జీవనం సాగిస్తున్నారు. ఆంధ్రప్రభ కథనం అనంతరం పోలీసులు స్పందించి వృద్ధుడికి ఆశ్రయం కల్పించడంపై గ్రామ ప్రజలు ఆంధ్రప్రభ యాజమాన్యానికి, ఎస్సై సంజీవ్కు, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
