అక్రమ నల్ల బెల్లం రవాణాపై పోలీసుల దాడి

45 బస్తాల నల్ల బెల్లం, రెండు వాహనాల స్వాధీనం..

ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నల్ల బెల్లం తరలిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి భారీగా నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో లావుడియా సురేష్, జాటోత్ నటేష్, నవీన్ నల్ల బెల్లం తరలిస్తుండగా అడ్డుకున్నారు. పోలీసులను గమనించిన నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడు. లావుడియా సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ దాడిలో 45 బస్తాల నల్ల బెల్లం (సుమారు 2,250 కిలోలు), ఒక స్విఫ్ట్ కారు, ఒక అశోక్ లేలాండ్ మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.