ప్రజాసేవతో మంచి పేరు తెచ్చుకోవాలి..
ప్రజాసేవతో మంచి పేరు తెచ్చుకోవాలి..
వైశ్య ప్రజాప్రతినిధుల సన్మాన సభలో మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్నకు ఘన సన్మానం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాభిమానంతో గెలుపొందిన వైశ్య ప్రజాప్రతినిధులు ప్రజాసేవతో మంచి పేరు తెచ్చుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ. వెంకటేశ్వర్లు, వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కాల్వ సుజాత అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ముషీరాబాద్ లోని వైశ హాస్టల్ లో నిర్వహించిన వైశ్య ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ సభలో మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తాను మెమొంటో అందజేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలని, పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని, అభివృద్ధి పనులు చేయాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్న గుప్తా గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉండి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల వారితో పాటు వైశ్య ప్రతినిధులు అభినందించారు. వైశ్య ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభలో తనను సన్మానించడం పట్ల నిర్వాహకులకు వైస్ చైర్మన్ వెంకన్న గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గంజి రాజమౌళి, సెంట్రల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
