Polavaram Tiger : హైటెక్నాలజీతో జల్లెడ Andhra Prabha News

Polavaram Tiger : హైటెక్నాలజీతో జల్లెడ Andhra Prabha News

  • పోలవరం అడవుల్లో గాలింపు
  • ఇప్పటికే 9 దూడలపై దాడి
  • తిమ్మాపురం ప్రాంతంలో ఆచూకీ
  • అధికారులు అప్రమత్తం
  • హనుమాన్ బృందాలు అలెర్ట్​
  • పశువులపై పులి దాడి ఘటనపై డిప్యూటీ సీఎం ఆరా

( ఆంధ్రప్రభ, చింతూరు)

పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పులి కదలికలపై ఆధునిక సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు పులి కదలికల సమాచారం చేరవేస్తూ, అప్రమత్తం చేయాలని తెలిపారు. బుధవారం రాత్రి అటవీ సరిహద్దు చికిలింత పంచాయతీ పరిధిలోని పశువుల కొట్టాల్లో దూడలపై పులి దాడి చేసిన సంఘటనపై పవన్ కళ్యాణ్ అటవీ అధికారులతో సమీక్షించారు. పులి దాడిలో తొమ్మిది దూడలు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు తెలియజేశారు.

ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్ లో పులి కదలికలను గుర్తించినట్టు, ప్రస్తుతం అటవీ ప్రాంతంలో సంచరిస్తూనే, గ్రామాలకు సమీపంగా వస్తున్నట్టు అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. అలాంటి పరిస్థితుల్లోనే అడవికి కేవలం 300 మీటర్ల దూరంలోని ఆయిల్ ఫాం తోటలో ఉన్న పశువుల పాకపై దాడి చేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పులి కదలికలపై క్షేత్ర స్థాయి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలి. మనుషులు, పశువుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో పులి జనారణ్యంలోకి వచ్చిన సందర్భంగా అటవీ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు.

Polavaram Tiger : హనుమాన్ బృందాల పర్యవేక్షణ

పులి సంచరిస్తున్న అటవీ సమీప గ్రామాల్లో హనుమాన్ బృందాలతో 24 గంటల పర్యవేక్షణ ఏర్పాటు చేయండి. అవసరం అయితే అదనపు హనుమాన్ టీంలను రంగంలోకి దించండి. తీసుకుంటున్న చర్యల పట్ల అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ స్వీయ పర్యవేక్షణ ఉండాలి. ఈ మొత్తం ఆపరేషన్ పర్యవేక్షణకు అవసరమైన పక్షంలో అటవీశాఖ కేంద్ర కార్యాలయం నుంచి సీనియర్ అధికారిని ఘటనా స్థలికి పంపాలి. అధునాతన సాంకేతికత సాయంతో ప్రతి అడుగును ట్రాక్ చేసే ఏర్పాటు చేయాలి. వన్య ప్రాణి సంరక్షణ నిబంధనల అనుగుణంగా చర్యలు ఉండాలి.అని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Polavaram Tiger : గ్రామల్లో అవగాహనా శిబిరాలు

పులి సంచారం నమోదైన అటవీ పరిసర గ్రామాల్లో క్షేత్ర స్థాయి సిబ్బంది సహకారంతో నిరంతరం అవగాహన శిబిరాలు నిర్వహించాలి. గ్రామస్తులు అవసరం లేకుండా అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులను అటవీ ప్రాంతానికి సమీపంగా కట్టి ఉంచడం, నిర్లక్ష్యంగా వదిలేయడం చేయకుండా రైతులకు సూచనలు ఇవ్వాలి. వన్య ప్రాణుల సంచారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల ప్రజలతో అధికారులు సున్నితంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలి. సమాచారాన్ని చేరవేయడం, ఫిర్యాదులపై స్పందించే అంశంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పశువుల ప్రాణ నష్టానికి తక్షణ పరిహారం కింద ఇప్పటికే రైతులకి కొంత మొత్తం అందజేశాం. పశు వైద్యుల నివేదిక వచ్చిన వెంటనే పూర్తి స్థాయి పరిహారం అందించే ఏర్పాటు చేస్తామ“న్నారు.

Leave a Reply