హనుమకొండకు చేరుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం
హనుమకొండ, ఆంధ్రప్రభ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం శనివారం హనుమకొండకు చేరుకుంది. ఆయనకు తుది నివాళులు అర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదాలత్ జంక్షన్లోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరవీరుల స్థూపాన్ని కేంద్రంగా చేసుకుని జరిగిన అనేక కార్యక్రమాలు, ఆందోళనల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చురుకుగా పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటారు. తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన అదే అమరవీరుల స్థూపం వద్ద ఆయనకు తుది నివాళులు అర్పించడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగంతో నివాళులర్పించారు.
