భూ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి..

  • ప్రతి సర్వే నంబర్‌ వరుస క్రమంలో నమోదు చేయాలి.
  • ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు అందేలా దృష్టి
  • పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలో చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. బుధవారం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం నిట్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా బోధన, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భూ రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తతో పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి సర్వే నంబర్‌ను వరుస క్రమంలో ఖచ్చితంగా నమోదు చేయాలని, రికార్డులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా భూ రీ-సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు తప్పనిసరిగా అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై మంచి అవగాహన కల్పించాలని, విద్యా ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రీ-ప్రైమరీ తరగతుల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి చదవగలిగే స్థాయికి చేరుకునేలా కృషి చేయాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు బోధన అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లలో ఎల్లప్పుడూ నీటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఏడీ సర్వే సోమేశ్వర్, జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు రాజమణి, తదితరులు పాల్గొన్నారు.