- కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆర్సీబీ
ముల్లన్పూర్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈరోజు (గురువారం) కీలకమైన పోరుకు వేదిక కానుంది. తొలి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలనే అశతో… ఒక అడుగు ముందు వెసేందుకు, పంజాబ్ కింగ్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కీలక పోరులో తలపడబోతున్నాయి.
టాప్ అప్డేట్.. రజత్ రిటర్న్స్ !
గాయం కారణంగా గత మ్యాచ్లలో కెప్టెన్సీ నుండి విరామం తీసుకున్న రజత్ పాటిదార్… ఈ మ్యాచ్లో తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉండగా, ఈ కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సిబి సారథి రజత్.. బౌలింగ్ ఎంచుకుని పంజాబ్ను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
కాగా, ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచుల్లో తలపడగా… పంజాబ్ కింగ్స్ జట్టు ఆర్సీబీపై 18-17 తేడాతో ఆధిక్యంలో ఉంది. అయితే, ఈ సీజన్ లో ఆర్సీబీ – పంజాబ్ కింగ్స్ రెండుసార్లు తలపడగా, రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్వుడ్.
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, అర్ష్దీప్ సింగ్.
పంజాబ్ బ్యాటింగ్కు బలమైన ఆరంభం !
పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ఈ సీజన్లో వైల్డ్ ఫైయర్ ఇన్నింగ్స్ తో దంచేస్తుంది. యువ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ ఆరంభం నుంచి దూకుడుగా, స్థిరంగా రాణించారు. ఇద్దరూ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 400పైగా పరుగులతో కన్సిస్టెంట్ ఫామ్లో ఉన్నారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అయితే 514 పరుగులతో జట్టుకు అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచారు.
మూడో స్థానానికి ప్రొమోట్ అయిన జోష్ ఇంగ్లిస్ అద్భుతంగా రాణిస్తూ.. కీలక ఇన్నింగ్స్లతో మ్యాచ్లు తిప్పేశాడు. స్టోయినిస్, శశాంక్, వాధేరా లాంటి ఆటగాళ్లు పట్టుదలగా రాణించి ఫినిషింగ్ లో ఆకట్టుకుంటున్నారు.
జాన్సన్ గైర్హాజరు.. పేస్ డిపార్ట్మెంట్లో మార్పులు !
బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ ఆరంభం నుంచే కీలక పాత్ర పోషించారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఆలస్యంగా ఫామ్లోకి వచ్చినా… మ్యాచ్లను గెలిపించే విధంగా రాణించారు. అయితే, చహల్ గాయంతో చివరి రెండు మ్యాచ్లు ఆడలేదు.
బెంగళూరు టీం ఎఫర్ట్ !
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే, 14 మ్యాచ్ల్లో 19 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 602 పరుగులతో, 8 అర్ధశతకాలతో ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో కోహ్లీ ఆడిన ప్రతి అర్ధశతకం మ్యాచ్ జట్టు విజయంలో కీలకమైంది. లీగ్ చివరి మ్యాచ్లో లక్నోపై జితేశ్ శర్మ చేసిన 33 బంతుల్లో 85 పరుగుల అజేయ ఇన్నింగ్స్ వారిని క్వాలిఫయర్కు తీసుకెళ్లింది.
బెంగళూరు తరుఫున 331 పరుగులు చేసిన ఓపెనర్ ఫిల్ సాల్ట్.. పవర్ప్లేలో జట్టుకు చక్కటి ఆరంభాన్ని ఇస్తూ.. విరాట్ తరువాత రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అయితే, రాజత్ పాటిదార్ ఫామ్ లో లేకపోవడం, లివింగ్స్టోన్ కుదురుకోలేకపోవడం బెంగళూరుకు తలనొప్పిగా మారింది. జితేశ్ శర్మ కెప్టెన్సీలో గొప్పగా ఇన్నింగ్స్ ఆడినా… ఫీల్డింగ్, బౌలింగ్ డిసిషన్స్లో లోపాలున్నాయనే విమర్శలు ఉన్నాయి. నేటి మ్యాచ్తో రజత్ పాటిదార్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు.
బౌలింగ్ డిపార్ట్మెంట్ కు సవాలు !
బౌలింగ్ విభాగంలో జోష్ హేజిల్వుడ్ సీజన్ ఆరంభంలో అద్భుతంగా రాణించారు. అయితే ఇటీవల గాయంతో జట్టుకు దూరమయ్యారు. హేజిల్వుడ్ తిరిగి జట్టులోకి రావడం బెంగళూరుకు బలాన్నిస్తుందని ఆశ.
భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్వుడ్ బంతితో సమర్థవంతంగా రాణిస్తే మాత్రమే పంజాబ్ను వారి సొంత మైదానంలో ఓడించగలుగుతారు.
ఇక నేటి మ్యాచ్లో విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ సాధన దిశగా మరో కీలక అడుగు వేయాలని పంజాబ్ మరియు బెంగళూరు జట్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.