ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల కీలక సమావేశం నేడు న్యూఢిల్లీలో జరుగనుంది.
ఈ అత్యున్నత స్థాయి సమావేశం అశోకా హోటల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగనుంది. జాతీయ భద్రత, కౌంటర్ టెర్రరిజం, భారత బలగాలు ఇటీవల చేపట్టిన మిలటరీ యాక్షన్, అనంతర క్రమంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గోనున్నారు.
ఇండియా ఇటీవల విజయవంతంగా కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించడంపై కీలకంగా ఈ సమావేశం జరుగనుందని అధికార వర్గాల సమాచారం. ఆపరేషన్ సిందూర్, మిలటరీ దాడుల అనంతరం భారతదేశం తీసుకున్న విస్తృత భద్రతా వ్యూహంపై నాయకులు సమావేశంలో చర్చిస్తారని చెబుతున్నారు.
జాతీయ భద్రత, టెర్రరిజంపై ప్రభుత్వ వైఖరిపై ఈ సమావేశం విస్పష్టమైన సందేశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆయా అంశాలపై ఎన్డీయే భాగస్వాముల మధ్య పరస్పర సహకారంపై కూడా చర్చిస్తారు.
కాగా, ఇప్పటికే అఖిలపక్ష ఎంపీల బృందం విదేశాల్లో పర్యటిస్తూ, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎండగడుతోంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతకు కట్టుబడి ఉన్నామనే బలమైన సంకేతాలిస్తోంది. ఇదే సమయంలో దేశీయంగా కూడా జాతీయ భద్రతపై భాగస్వామ్య పక్షాలతో ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేసి, ఐక్యగళం వినిపించేందుకు సిద్ధమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.