మహానాడు తెలుగువారందరి పండుగ

మహానాడు తెలుగువారందరి పండుగ
దేశంలో నెంబర్-1 ప్రాంతీయ పార్టీగా టీడీపీ నిలిచింది
కార్యకర్తల కష్టంతోనే పార్టీకి ఈ స్థానం : ఎంపీ కేశినేని శివనాథ్
పసుపు సైనికుల భుజాలపై నిలిచిన మహానాడు
భవానిపురం, ఆంధ్రప్రభ : మహానాడు పండుగ తెలుగువారందరి పండుగ అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వీఎంసీ హాల్లో 55, 56 డివిజన్ల క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
భారతదేశంలోని ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ నెంబర్-1 స్థానంలో నిలవడానికి కార్యకర్తల కష్టమే ప్రధాన కారణమని ఆయన అన్నారు. కోట్లాది సభ్యత్వాలతో దేశంలోనే అతిపెద్ద సభ్యత్వ బలం కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మహానాడులో ఆమోదించే తీర్మానాలను ప్రభుత్వ విధానాల రూపంలో అమలు చేస్తామని వెల్లడించారు.
“పసుపు సైనికుల పండుగే మహానాడు. కార్యకర్తలు భుజాలపై వేసుకుని నిర్వహించే మహోత్సవం ఇది. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కార్యకర్తల అండతోనే పార్టీ నిలబడగలిగింది” అని కేశినేని చిన్ని పేర్కొన్నారు.
నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని ఆయన అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గమని కొనియాడారు. ఈ నియోజకవర్గంలో తొలిసారిగా మహానాడు కార్యక్రమానికి హాజరుకావడం సంతోషంగా ఉందని తెలిపారు.
