coach | వారందరికీ ధన్యవాదాలు
coach | వారందరికీ ధన్యవాదాలు
భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్
ద్రవిడ్, లక్ష్మణ్ విజయానికి పునాది వేశారు
మద్దతుగా నిలిచిన జై షా కూ థ్యాంక్స్
మైలురాళ్ల కన్నా ట్రోఫీలే ముఖ్యం
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు ప్రత్యేక ధన్యవాదాలు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టీ20 వరల్డ్కప్ గెలిచిన తర్వాత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడారు. టీమ్ ఇండియా వరల్డ్ కప్ విజయాన్ని ఇద్దరు క్రికెట్ దిగ్గజాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ చేసిన సేవలే ఆ విజయానికి పునాది అని గంభీర్ పేర్కొన్నారు. గతంలో ఎదురైన విమర్శల మధ్య కూడా తనకు మద్దతుగా నిలిచిన వారికి ట్రోఫీని అంకితం చేస్తున్నానని తెలిపారు.
“భారత జట్టును పటిష్ఠమైన స్థితిలో ఉంచినందుకు రాహుల్ భాయ్కు, భవిష్యత్ తారలను తీర్చిదిద్దుతున్న లక్ష్మణ్కు ఈ ట్రోఫీని అంకితం చేస్తున్నా” అని ఆయన పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నిజాయతీతో పనిచేసిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను కూడా ప్రశంసించారు. తన కోచింగ్ కెరీర్లో అత్యంత క్లిష్ట దశ ఎదురైనప్పుడు జై షా తనకు ఎలా ధైర్యం చెప్పారో గంభీర్ గుర్తుచేసుకున్నారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్లు ఓడిపోయినప్పుడు తానెంతో కుంగిపోయానని, ఆ సమయంలో జై షా ఫోన్ చేసి తనపై నమ్మకం ఉంచారని గంభీర్ తెలిపారు. ఆ నమ్మకమే ఈ విజయానికి కారణమని ఆయన పరోక్షంగా వెల్లడించారు. “మన దేశంలో వ్యక్తిగత మైలురాళ్లను ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. కానీ ట్రోఫీలే ముఖ్యం. ఆ మార్పు కోసమే నేను పనిచేస్తున్నా” అని గంభీర్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ పటిమ తన పనిని సులభతరం చేసిందని కొనియాడారు
