వి.కోట, ఏప్రిల్ 6 (ఆంధ్రప్రభ) : మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో దారిదోపిడి ముఠా ఓ కారును అడ్డగించి రూ.3కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లింది. పోలీసుల కథనం మేరకు.. వేలూరు నుంచి కర్ణాటకలోని కేజీఎఫ్ కు కారులో బంగారాన్ని తీసుకెళ్తుండగా ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన నాయకనేరి అటవీ ప్రాంతంలో ఐదుగురు గుర్తుతెలియని దుండగులు కారును అడ్డగించి కత్తులతో బెదిరించి 3.75 కిలోల బంగారు కడ్డీలను దోచుకెళ్లారు.
కేజీఎఫ్ కు చెందిన మార్వాడి అక్కడ స్థానికంగా ఉన్న దుకాణాలకు బంగారాన్ని ఇస్తుంటాడు. బుధవారం రాత్రి వేలూరు నుండి తన కారులో బంగారాన్ని తీసుకెళ్తుండగా మరో కారులో వెంబడించిన దుండగులు ఆంధ్ర సరిహద్దులోకి వచ్చాక అటవీ ప్రాంతంలో దుండగులు మార్వాడి కారును అడ్డగించారు. ముఖాలకు మాస్కులు ధరించిన దుండగులు మార్వాడిని, వారి డ్రైవర్ ను కత్తులతో బెదిరించి, బంగారాన్ని దోచుకెళ్లారు. ఆరోజు రాత్రి 8.30గంటలకు చోటుచేసుకున్న ఈ సంఘటనతో నివ్వెరపోయిన మార్వాడి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డీఎస్పీ ప్రభాకర్, సీఐ సోమశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర – తమిళనాడు పరిధిలో ఉన్న పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచారు. శుక్రవారం చిత్తూరు నుండి వచ్చిన క్లూస్ టీమ్, క్రైమ్ పార్టీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచి ఈ కేసును ఛేదించే పనిలో పోలీసులున్నారు. బంగారు దోపిడీ చేసిన ఐదు మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.