మాజీ మంత్రి రెడ్యా నాయక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

మరిపెడ, ఆగస్టు13(ఆంధ్రప్రభ ) : మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులోని రైస్‌మిల్లుకు వెళ్లే రోడ్డు వద్ద మాజీ మంత్రి రెడ్యా నాయక్‌ ప్రయాణిస్తున్న కారుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది.

స్థానికుల కథనం ప్రకారం…ముందుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకోవడంతో, ఎదురుగా వస్తున్న కూలీలను తప్పించేందుకు మాజీ మంత్రి కారు డ్రైవర్‌ వాహనాన్ని నెమ్మదిగా నడిపారు. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారు మాజీ ఎమ్మెల్యే కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది.దీంతో కారు వెనుక భాగం దెబ్బతింది.

ప్రమాద సమాచారం తెలుసుకున్న అబ్బాయిపాలెం, ధారావత్‌ తండా గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని మాజీ మంత్రి రెడ్యా నాయక్‌ను పరామర్శించారు.ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.