టెక్సాస్ – అమెరికాలో భారత సంతతికి చెందిన యువ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై మరో భారతీయుడే దాడి చేసి ప్రాణాలు తీశాడు. మృతుడిని అక్షయ్ గుప్తా (30)గా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే, హెల్త్ టెక్ స్టార్టప్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన అక్షయ్ గుప్తా ఈ నెల 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్న ఆయనపై దీపక్ కండేల్ అనే మరో భారతీయుడు అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. సీసీ ఫుటేజీ ప్రకారం చూస్తే అక్షయ్ గుప్తా బస్సులో వెనుక సీట్లో కూర్చుని ఉండగా, ఖండేల్వాల్ అతని వద్దకు ఆవేశంతో వెళ్లి కత్తితో ఎటాక్ చేశాడు. ఆ తర్వాత బస్సు ఆగిన వెంటనే ఏమి తెలియనట్లుగా బయటకు దిగిపోయి ఇతర ప్రయాణికులతో కలిసి వెళ్లాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
మామపై కోపంతో..
రంగంలోకి దిగిన అక్కడి పోలీసులు 31 ఏళ్ల దీపక్ ఖండేల్వాల్ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో దీపక్ ఖండేలాల్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ క్రమంలో గుప్తా తన మామలా కనిపించడం వల్లే ఇలా చేశానని అతను చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
అక్షయ్ ప్రతిభాశాలి..
మరోవైపు అక్షయ్ గుప్తా ప్రతిభావంతుడైన విద్యార్థి. ఆయన పెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మంచి యువ వ్యాపారవేత్త. చిన్న వయస్సులోనే సాంకేతిక రంగంలో మంచి ప్రావీణ్యత సంపాదించారు. ఆయన “ఫూట్బిట్” అనే ఆరోగ్య టెక్ స్టార్టప్ను ప్రారంభించారు. ఇది వృద్ధుల సహాయం కోసం ఏర్పాటు చేశారు. ఆయన గతంలో మైక్రోసాఫ్ట్ సిఈవో సత్య నాదెల్లా నుంచీ పిలుపు అందుకున్నారు. దీంతోపాటు గుప్తా అమెరికాలోని అమెజాన్ నుంచి $300,000 ఆఫర్ను తిరస్కరించి, తన స్టార్టప్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా హత్యకు గురికావడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
ఇక అక్షయ్ గుప్తా. తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను కూడా కలిశారు.