వెలగపూడి ,ఆంధ్రప్రభ – విజన్ 2047ను సక్సెస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, విజన్ డాక్యుమెంట్ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజక వర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తాం అని, ప్రతి ఒక్కరిని విజన్ 2047లో భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రతీ ఏడాది 15 శాతం గ్రోత్ రేట్ ఉండాలని, వికసిత్ భారత్ -2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. ఆనాడు హైదరాబాద్ను విజన్ 2020 పేరుతో అభివృద్ధి చేశామని, ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో హైదరాబాద్ నంబర్ వన్ అయిందని సీఎం చెప్పారు.
విజన్-2047 డాక్యుమెంట్పై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్బంగా మాట్లాడుతూ, 2047 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అగ్రజాతిగా భారతీయులే నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 వికసిత్ భారత్ను ప్రధాని మోడీ అమలు చేస్తున్నారు. అందుకే ఏపీ కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించాం. ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్లో పెట్టగలిగాం. దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలి. 1990ల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్కు విజన్ 2020 తీసుకువచ్చాం. చెప్పినదానికంటే ఎక్కువ ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనం కలిగింది. ప్రస్తుతం 2047 విజన్ డాక్యుమెంట్లో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లను కూడా రూపొందించాం. 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా మారటమే లక్ష్యం. అలాగే రూ.308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు చేశాం. ప్రతి ఏటా 15 శాతం వృద్ధి రేటుతో రూ.55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నాం..అని సీఎం చంద్రబాబు చెప్పారు.
పివి సంస్కరణలతోనే అభివృద్దిలో దేశం పరుగులు.
స్వాతంత్ర్యం సిద్ధించి 2047 సంవత్సరం నాటికి వందేళ్లు కూడా పూర్తవుతాయి. తెలుగు బిడ్డ పీవీ నరసింహరావు తీసుకువచ్చిన సంస్కరణలతో దేశం వృద్ధి బాటలో నడుస్తోంది. ఈ సంస్కరణల్లో 1 శాతంలో నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా. మన జనాభా కూడా మనకు సంపాదన సాధించే వనరుగా మారుతుంది. స్వర్ణాంధ్ర సాధన కోసం కొన్ని ప్రత్యేకమైన లక్ష్యాలను కూడా నిర్దేశించుకున్నాం. పట్టణ ప్రాంత జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. ఎగుమతుల విలువ కూడా గణనీయంగా పెరగాల్సి ఉంది. అందుకు అనుగుణంగా 1o సూత్రాలను నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ వైపు అడుగులు వేస్తున్నాం. పేదరికం లేని సమాజం, అన్ని అంశాల్లో టెక్నాలజీ అనుసంధానం, పీ4 లాంటి అంశాలను ఇందులో పొందుపరిచాం..అని సీఎం పేర్కొన్నారు.