TG | పబ్లిక్ డొమైన్ లో కులగణన వివరాలు… మంత్రి ఉత్తమ్
- అన్ని వివరాలు ప్రజలకు అందుబాటులో
- సర్వేపై మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- అందరి అనుమానాలను నివృత్తి చేస్తాం
- కులగణన ఆధారంగానే ఇక సంక్షేమ పథకాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కులగణన సర్వేకు సంబంధించి వ్యక్తిగత వివరాలు మినహాయించి రేపు, ఎల్లుండిలోగా పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను జిల్లాల వారిగా పెడతామని కులగణన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సర్వేపై అపోహలు, అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి వారితో చర్చించి అపోహాలను నివృత్తి చేస్తామన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో బీసీ కులగణనపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… కుల గణన సర్వే నివేదిక లెక్కల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తుందని స్పష్టం చేశారు. కులగణన సర్వే మీద కొందరు అపోహలు.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కుల గణన సర్వే ఎలా జరిగింది అనేది ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వివరిస్తుందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఇంత శాస్త్రీయంగా, లాజికల్ గా దేశంలోని ఏ రాష్ట్రంలో కులగణన జరగలేదని ఉత్తమ్ తెలిపారు.
కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవద్దని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ వివరణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అన్ని కులాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే జరిగిందని, సర్వేపై ప్రజలు ఎవరికి ఇందులో అపోహలు అవసరం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. మొదట సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చుకున్నారని..అది పబ్లిక్ డొమైన్ లో లేని డాక్యుమెంట్ అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా చేసుకొని చేసిందేనన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర్ రాజా నరసింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.