పరకాలలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
కాంగ్రెస్పై చల్లా ధర్మారెడ్డి ఘాటు విమర్శలు
పరకాల, ఏప్రిల్ 27 (ఆంధ్రప్రభ): పరకాల పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ పట్ల నిబద్ధత, ఐక్యత ఉంటే బిఆర్ఎస్ మరింత శక్తివంతమవుతుందని స్పష్టం చేశారు.ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు లేకపోవడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం, సంక్షేమ పథకాల అమలులో జాప్యం వంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని అన్నారు.
ధరల పెరుగుదల, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం, పరిపాలనలో అయోమయం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై మరింత ఉత్సాహంగా పోరాటం చేస్తుందని, ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుకు పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
