కదంబాపూర్లో దారుణం.. కుటుంబ కలహాలతో వ్యక్తి హత్య
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కకాశిపల్లిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. తల్లి, కుమారుడు కలిసి తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కకాశిపల్లికి చెందిన సయ్యద్ గోరేమియా (40)కు గత ఆరు నెలలుగా భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. దీంతో గోరేమియా గత రెండు నెలలుగా మెట్పల్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు.
మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన గోరేమియా తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో భార్య వద్దకు వెళ్లగా, అక్కడ మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో కుమారుడు సయ్యద్ అలీ (18) మట్టి పెల్లతో గోరేమియాపై బలంగా దాడి చేశాడు.
అనంతరం తల్లి కూడా నీళ్ల సీసాతో దాడి చేయడంతో గోరేమియా అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
