వెలగపూడి – రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఆసియన్ డెవల్పమెంట్ బ్యాంకు(ఏడీబీ) నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు, ఏడీబీ రూ.6,700 కోట్లు కలిపి మొత్తం రూ.13,600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి.
మరో రూ.1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో (ఎఫ్ఆర్బీఎం) లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి రూ.11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. అలాగే, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
రాజధానిపై వైసీపీ కుట్రలతో జాప్యం
అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ చెరో రూ.6,700 కోట్ల చొప్పున రుణాన్ని గతేడాది డిసెంబరులో ఆమోదించాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత అప్పు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ కొందరు ఆ బ్యాంకుకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది. 2018లో కూడా వైసీపీ ఇలాంటి కుట్రలే చేసి అమరావతికి అప్పు రాకుండా అడ్డుపుల్లలు వేసింది. కానీ, ఈసారి వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వాస్తవానికి 2018లోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. కానీ ఆ నిధులు రాకుండా నాటి ప్రతిపక్ష నేత జగన్, విజయసాయిరెడ్డి కుట్రలు పన్నారు. అప్పటి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారు. అమరావతి వరదలకు మునిగిపోతుందని పదేపదే ఈ-మెయిళ్లు పంపారు.
రాజధాని గ్రామాలతో సంబంధంలేని రైతులతోనూ ఫిర్యాదులు చేయించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రచారం చేశారు. ఈ పరిణామాలతో ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గింది. అనంతరం సీఎం అయిన జగన్… అమరావతి నిర్మాణానికి తమకు రుణం అక్కర్లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. 2014-19లో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లను క్లోజ్ చేయకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయారు. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, కరకట్ట రోడ్డు వంటి 19 పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటి విలువ రూ.16,871 కోట్లు. చంద్రబాబు సీఎం అయ్యాక వీటికి అంచనాలు తయారుచేశారు. 31 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. పనులకు టెండర్లు కూడా ఖరారు చేశారు . ఇక ఇక్కడ నిర్మాణ పనులు ఈ నెల రెండో వారం నుంచి ప్రారంభం కానున్నాయి.