విద్యా వ్యవస్థను ద్వంసం చేశారంటూ ఆగ్రహం
మీ పాలనలో రూ.4271 కోట్లు ఫీజు రీయింబర్మ్సెంట్ బకాయిలు
ఆ బాకీలు తీర్చాల్సిన బాధ్యత మాపై నెట్టారు
ఇప్పటికే మేం రూ.1388 కోట్లు చెల్లించాం..
మిగిలన మొత్తాన్ని విడదల వారీగా చెల్లిస్తాం
రాజకీయాలు వేరు.. ప్రభుత్వం వేరని ఎప్పుడు తెలుసుకుంటారు జగన్..
వెలగపూడి – మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పాలనలో అంతా విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. మీ బకాయిలు మేమెందుకు చెల్లించాలనే విధంగా వైసీపీ పాలన సాగిందాన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రూ.600 కోట్లు విడుదల చేసిన సందర్బంగా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా జగన్ పాలనను నేడు ఎండగట్టారు.. అన్ని అభివృద్ధి పనులను నిలిపివేశారని, విధ్వంసాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించిన విధంగా తాము ప్రవర్తించడం లేదన్నారు. గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం శాశ్వతం.. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం అని ఇప్పటికైనా తెలుసుకోండి జగన్ రెడ్డి అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం మారినా.. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ విధ్వంసపాలనతో బ్రేక్ చేశారు.. 2019లో అధికారంలోకి వచ్చిన మీరు గత ప్రభుత్వ బకాయిలు మేమెందుకు చెల్లించాలి అంటూ మొండికేశారు.. టీడీపీ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను నిలిపేశారు.. మరికొన్ని ధ్వంసం చేశారు.. ఈ నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. మేము అధికారంలోకి వచ్చామని మంత్రి పేర్కొన్నారు.
ఇక, మా విద్యాశాఖలో మీరు పెట్టి వెళ్లిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4271 కోట్లు.. ఇవి విడతల వారీ చెల్లిస్తామని మాట ఇచ్చాను.. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేసిన మా ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసిందని అన్నారు. అయితే, త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మీరు పెట్టిన బకాయిలు ఆర్థిక భారంగా మారినా, చివరి రూపాయి వరకూ బకాయిలు చెల్లించడం, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడమే మా బాధ్యతగా భావిస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.