తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం…
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నివాసంలో కలయిక
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసం వద్ద ఏర్పాటు చేసిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా సమస్యల పై చర్చించారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గంగాపురం కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీలు దగ్గుబాటి పురందరేశ్వరి, ఎం.శ్రీభరత్, గంటి హరీష్ మాధుర్, కేశినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి, బైరెడ్డి శబరి, సీఎం రమేష్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, బీదా మస్తాన్ రావు (బీఎంఆర్), కలిశెట్టి అప్పలనాయుడు, పాక సత్యనారాయణ, భాష్యం రామకృష్ణ,సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విచ్చేసిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సమావేశాల బిజీ షెడ్యూల్ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ ప్రజాప్రతినిధులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించినందుకు భూపతిరాజు శ్రీనివాస వర్మను పలువురు నేతలు అభినందించారు. రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల సాధన కోసం ఇలాంటి సమన్వయ సమావేశాలు భవిష్యత్తులో కూడా తరచుగా నిర్వహించాలని సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.
