హైదరాబాద్, ఆంధ్రప్రభ : సైబర్ నేరగాళ్లు సృష్టించే ఉచ్చులో చిక్కుకుని అమాయక ప్రజలు ఏటా వేల కోట్లు నష్టపోతున్నారు. ఒక్క తెలంగాణలోనే లక్షల సంఖ్యలో సైబర్ నేరాలు నమోదవుతుండగా, ఆర్థిక, మానసిక నష్టాలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ నేపధ్యంలో, పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు (hyderabad city police) ప్రత్యేక అవగాహన (awareness) డ్రైవ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిటీ కమిషనర్ వి.సి. సజ్జనార్ (V.C. Sajjanar), తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి (B. Shivadhar Reddy) కలిసి “జాగృత హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్” (Jagrut Hyderabad – Surakshit Hyderabad) పేరుతో సైబర్ క్రైమ్ (Cybercrime) అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ‘సైబర్ సింబా’ (Cyber Simba) లోగో, క్యూ.ఆర్. కోడ్ (QR Code) ను ఆవిష్కరించారు. ఈ ‘సైబర్ సింబా’ లోగో డిజిటల్ విజిలెన్స్ (Digital Vigilance) కు ప్రతీకగా నిలుస్తుందని వారు తెలిపారు. అలాగే, ఈ అవెర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్సాహభరిత వాలంటీర్లకు సైబర్ సింబా బ్యాడ్జ్లు (Cyber Simba Badges) ను అందజేశారు.
ప్రతి ఇంట్లో ఒక ‘సైబర్ సింబా’ ఉండేలా చూడడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు ఒక డిజిటల్ రక్షకుడి(Digital Protector)గా మారేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో భద్రత పట్ల అలసత్వం వీడి, సైబర్ భద్రతను రోజువారీ అలవాటుగా మార్చుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు.
Cyber Simba – అక్టోబర్లోనే 55 మంది…
కేవలం అక్టోబర్ నెలలోనే హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 55 మంది నిందితులను అరెస్టు చేసి, బాధితులకు రూ.62,34,446/- భారీ మొత్తాన్ని రిఫండ్ చేశారు.
అరెస్టు చేసిన నిందితుల వద్ద 61 బ్యాంక్ ఖాతాలు (Bank Accounts) గుర్తించగా, వాటి ద్వారా దాదాపు రూ.107 కోట్లు విలువైన లావాదేవీలు (Transactions) జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నిందితులు దేశవ్యాప్తంగా 136 సైబర్ క్రైమ్ కేసుల్లో (Cyber Crime Cases) పాల్గొన్నట్లు బయటపడింది. వాటిలో 45 కేసులు తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై గట్టి దెబ్బగా నిలిచింది.



