108 vehicle | మూగబోయిన కుయ్..కుయ్..

108 vehicle | మూగబోయిన కుయ్..కుయ్..
- 108 వాహనానికి సుస్తీ..
- రెండు నెలలుగా అందుబాటులో లేని వాహనం
- ఇబ్బందుల్లో మోపిదేవి మండల ప్రజలు
108 vehicle | ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో : అత్యవసర సమయాల్లో ఉపయోగపడే 108 వాహనాలు గత రెండు నెలలుగా అందుబాటులో లేదు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా జిల్లాలోని మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అదేకాకుండా మచిలీపట్నం – మోపిదేవి వరకు జాతీయ రహదారి ఉంది.
టింక్కరింగ్, రిపేర్ల నిమిత్తం 108 వాహనాన్ని అధికారులు తీసుకెళ్లి రెండు నెలలు కావొస్తున్నా నేటికీ అది అందుబాటులోకి రాలేదు. 108లో పని చేసే ఉద్యోగులను ఇతర మండలాలకు వేయటంతో వారు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మోపిదేవి మండలంలో ఏదైనా ప్రమాదం జరిగితే బయటి మండలాల నుంచి వాహనాలు వచ్చి ప్రమాద బాధితులను తీసుకెళ్తున్నాయి.
మోపిదేవి మండలంలో మోపిదేవి, పెదకళ్లేపల్లి పిహెచ్సిలు ఉండగా, మొత్తం 13 పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ మండలానికి 108 వాహనం ఉంది. కానీ ఒక్క మోపిదేవి మండలంలోనే 108 వాహనం అందుబాటులోకి రాలేదు. రిపేరుల నిమిత్తం వాహనాలు తీసుకెళ్తున్న అధికారులు వాటిని త్వరగా పంపించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు వాపోతున్నారు. కనీసం సమాచారాన్ని అడిగినా 108 సిబ్బంది తమకు తెలియదని దాట వేస్తున్నారు.
