Rally | యోగాతో ప్రశాంతత..

Rally | యోగాతో ప్రశాంతత..
- ఏపీ యోగా సభ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ
Rally | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ బాపిరాజు పిలుపునిచ్చారు. యోగా గురువు శ్రీ ములక్ రాజ్ మహారాజ్ వారి 127వ జయంతి పురస్కరించుకొని ఏపీ యోగా సభ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నగరంలోని గాంధీనగర్లోని ఉదయపు నడక మిత్రమండలి భవనం నుంచి యోగా సభ్యులచే బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ నగరంలోని లక్ష్మీ టాకీస్ అంబేద్కర్ సర్కిల్, సాయిబాబా గుడి కోర్టు సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, కోనేరు సెంటర్ మీదుగా చింతగుంటపాలెంలోని దివ్య యోగా మందిర్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ యోగా సాధన వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయన్నారు. యోగాతో మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఆస్తమా, కీళ్ల నొప్పులు తదితర వ్యాధులన్నీ ఎలాంటి ఖర్చు లేకుండా యోగా ద్వారా సహజ సిద్ధంగా నియంత్రించుకొని ఆరోగ్యంగా జీవనం గడపవచ్చన్నారు. మచిలీపట్నంలోనీ 5 కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 వరకు ఒకరోజు కూడా అంతరాయం లేకుండా ఉచితంగా యోగా శిక్షణ కేంద్రాలు నడుపుతున్నారని, తద్వారా చాలామంది ప్రయోజనం పొందుతున్నారన్నారు.
ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చింతగుంటపాలెంలోని ప్రధాన యోగా శిక్షణ కేంద్రం దివ్య యోగ మందిరంలో ఉత్తర భారత్ నుండి వచ్చిన యోగా నిష్ణాతులు దమయంతిజి వారిచే ప్రత్యేక ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అనంతరం యోగా గురువులు జి గురునాథ్ బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి యోగా సాధన ఒక గొప్ప ప్రక్రియ అన్నారు. మచిలీపట్నం నగర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉత్తర భారత దేశం నుండి యోగా నిష్ణాతులు దమయంతిజి మచిలీపట్నంకు విచ్చేసి ఈనెల 5వ తేదీ సోమవారం నుండి 11వ తేదీ వరకు ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు ఉచితంగా యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు.
ఈ ర్యాలీలో యోగా గురువులు జి మహాలక్ష్మి, మద్దాల చింతయ్య, వడ్డీ శ్రీనివాస్, యోగా సభ్యులు జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్, సూర్యనారాయణ, జగన్మోహనరావు, ఆర్. దుర్గాప్రసాద్, అశోక్ మాస్టర్, రాజకుమారి, రేఖ, పద్మావతి, బ్రహ్మం, భాస్కర్, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.
