High Court | ఆదాయం కోల్పోయాం.. నష్టపోతున్నాం!

High Court | ఆదాయం కోల్పోయాం.. నష్టపోతున్నాం!
- పంచాయతీ విభజనతో నష్టపోతున్న గ్రామస్థులు
- హైకోర్టును ఆశ్రయిస్తా
- పాలకుర్తి ఉప సర్పంచ్ ఐద బుగ్గ రామస్వామి
High Court | పాలకుర్తి, ఆంధ్రప్రభ : ఉమ్మడి పాలకుర్తి పంచాయతీని ఐదేళ్ల కిందట పాలకుర్తి, బసంత నగర్గా విభజన చేశారని, దీంతో సిమెంట్ పరిశ్రమ(Cement industry)కు చెందిన ఆదాయం పాలకుర్తి పంచాయతీ కోల్పోతుందని ఉప సర్పంచ్ ఐద బుగ్గ రామస్వామి అన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లాలన్నా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
సిమెంట్ ఫ్యాక్టరీ ప్రభావిత గ్రామాల జాబితాలో ఉమ్మడి పాలకుర్తి ఉండగానే, విభజన అనంతరం బసంత నగర్ పంచాయతీకి పరిశ్రమ పన్ను జమ అవుతుందని, ప్రభావిత గ్రామమైన పాలకుర్తి పంచాయతీకి ఎలాంటి ఆదాయం(income) రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూములు, వనరులు, సహకారం గ్రామస్తుల నుంచే తీసుకున్నారని, కానీ లాభాలు మాత్రం కంపెనీకి మాత్రమే చేరుతున్నాయని అన్నారు.
ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో స్థానికులకు ఉపాధి కల్పిస్తామని హామీలు ఇచ్చారని, కానీ నేటికీ గ్రామ యువతకు సరైన ఉద్యోగాలు ఇవ్వలేదని ఉపసర్పంచ్ మండిపడ్డారు. ఉద్యోగాల కోసం యువత పట్టణాల వైపు వలస వెళ్లాల్సి వస్తోందని, ఇది గ్రామ భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదంగా మారిందన్నారు.
ఫ్యాక్టరీకి అనుబంధంగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల(mining activities) కారణంగా భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయని తెలిపారు. బోర్లు ఎండిపోతున్నాయని, సాగునీరు లేక రైతులు పంటలు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. తాగునీటి సమస్య గ్రామంలో రోజురోజుకూ తీవ్రతరమవుతోందని హెచ్చరించారు.
హైకోర్టును ఆశ్రయిస్తా..
పరిశ్రమతో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి హైకోర్టును(High Court) ఆశ్రయిస్తానని ఉప సర్పంచ్ అన్నారు. గ్రామ విభజనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని, ఉమ్మడి పాలకుర్తిని ప్రభావిత గ్రామంగా పరిగణించి ట్యాక్స్, అభివృద్ధి నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాలపై త్వరలోనే రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ లను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే ప్రజా ఉద్యమానికి కూడా సిద్ధమని చెప్పారు.
