సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన‌ హామీ నెర‌వేర‌లేదు

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన‌ హామీ నెర‌వేర‌లేదు

వరంగల్/హన్మకొండ, ఆంధ్ర‌ప్ర‌భ : స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న జ‌నాల వ‌ద్ద‌కు జాగృతి జ‌నంబాట(Awakening people) వెళుతుంద‌ని జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ఈ రోజు హన్మకొండ, సమ్మయ్య నగర్ వరద బాధితులను ఆమె ప‌రామ‌ర్శించారు. వరంగల్ లోని సమ్మయ్య నగర్(Sammaiah Nagar) సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో మునిగిన ఇళ్లను కూడా ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటామ‌న్నారు. సీఎం మాట అంటే జీవోతో స‌మాన‌మ‌ని, ప‌దిహేను రోజుల కింద‌ట ఇక్క‌డ‌కు వ‌చ్చిన సీఎం హామీలు ఇచ్చార‌ని, కానీ ఇంత వ‌ర‌కు అమ‌లు కాలేద‌న్నారు. ప్రజలకు కలెక్టర్ తక్షణ సాయం ఎందుకు చేయలేదని ప్ర‌శ్నించారు. విప‌త్తు జ‌రిగిన వెంట‌నే త‌క్ష‌ణ సాయం అందించేవాళ్ల‌ని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని అన్నారు.

వరంగల్ ప్రజలు విజ్ఞులని, ఈ ప్రభుత్వ తీరును అర్థం చేసుకోవాలని క‌విత అన్నారు. పిడుగు పడినా సరే వారికి ఒక ఐదు వేలు అందిస్తామ‌ని అన్నారు. వరంగల్ లో 150 ఇళ్లు కొట్టుకుపోతే నయా పైసా సాయం(Naya Paisa Sayam) చేయలేద‌ని చెప్పారు. ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల‌న్నారు. వెంటనే ఇక్కడి ప్రజలకు సాయం అందించాలని కలెక్టర్‌ని డిమాండ్ చేశారు. ఇక్కడి లోతట్టు ప్రాంతంలో 25 ఏళ్లుగా గుడిసెలు వేసుకున్న వాళ్లు ఉన్నారన్నారు. వారికి గతంలో తాము ఏం చేయలేకపోయామ‌ని, రేవంత్ రెడ్డి పక్కా ఇళ్లు కట్టిస్తామని వారికి మాట ఇచ్చార‌ని గుర్తు చేశారు. వెంటనే వారికి పక్కా ఇళ్లను మంజూరు చేయాల‌న్నారు.

గతంలో ఎన్నడూ మునగని రామన్నపేట లాంటి ప్రాంతాల‌కు జ‌ల‌మ‌యం అవుతుంద‌ని, ఇది పూర్తిగా అధికారుల నిర్ల‌క్ష్య‌మేన‌ని క‌విత అన్నారు.. చాలా పనులను అసంపూర్తిగా వదిలేశారని, ఇది పకృతి విపత్తు కాద‌ని, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చూసిన దానికన్నా వందరెట్లు ఎక్కువ నష్టం జరిగింద‌ని, అందుకే ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని డిమాండ్(Demand) చేస్తున్నాన‌ని అన్నారు. జాగృతి సంస్థగా తాము ఒక కుటుంబానికి సాయం అందించామ‌ని, తాము సాయం చేయగలిగినప్పుడు…ప్రభుత్వం ఇంకా ఎంత చేయాలి? అని ప్ర‌శ్నించారు.

Leave a Reply