ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు జైనథ్లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలతో తరించారు. ఆలయ అర్చకులు కలెక్టర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయ చరిత్ర, విశిష్టత, పురాతన ప్రాశస్త్యం గురించి వివరించారు. అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆలయ కమిటీ కలెక్టర్కు వివరించింది. అర్చకులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు ప్రసాదం అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

ఆలయ అభివృద్ధిపై ఆరా
అనంతరం ఆలయ ప్రాంగణం, పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిశుభ్రత, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పచ్చదనం పెంపు, సుందరీకరణ, ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.