తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దేశంలోని వివిధ హైకోర్టుల నుండి 19 మంది న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు, పలువురు న్యాయవాదులు మరియు జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులుగా లేదా అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ హైకోర్టులో నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు వీరే:
- గౌస్ మీరా మొహియుద్దీన్
- చలపతిరావు సుద్దాల
- వాకిటి రామకృష్ణారెడ్డి
- గడి ప్రవీణ్ కుమార్
ఇక మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఏకంగా 11 మంది — ఏడుగురు న్యాయమూర్తులు, నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గౌహతి హైకోర్టుకు నాలుగు నియామకాలు జరగ్గా, దేశవ్యాప్తంగా మొత్తం 19 మంది న్యాయమూర్తుల నియామకానికి ఈ నిర్ణయం అనుమతి లభించింది.