ఢిల్లీ: గతంలో కేసీఆర్ (kcr ) తెలంగాణ హక్కులను(Telangana rights) ఆంధ్రప్రదేశ్కు ధారాదత్తం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM revanth reddy) విమర్శించారు. బీఆర్ఎస్ (BRS ) ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షానా మాట్లాడలేదని, కేవలం సమన్వయకర్త పాత్ర మాత్రమే పోషించిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఢిల్లీ లో నేడు జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల విషయంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు అధికారులు, ఇంజినీర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ నుంచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామనే ప్రతిపాదన ఈ సమావేశంలో రాలేదని ఆయన తేల్చి చెప్పారు. అలాంటి ప్రతిపాదనే రానప్పుడు దానిని ఆపాలనే చర్చ కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది అపెక్స్ కమిటీ సమావేశం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం మధ్యవర్తిత్వమే చేసింది
ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షానా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించిందని వివరించారు. రాష్ట్రాల మధ్య పటిష్టమైన చర్చ జరిగేందుకు కేంద్రం వేదిక మాత్రమేనన్నారు.ఇప్పటికీ పెండింగ్లో ఉన్న నీటి సమస్యలపై దృష్టి పెట్టిన సమావేశమిది. భవిష్యత్తులో ఇలాంటి అంశాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది. రాష్ట్రాల మధ్య సమన్వయం పెరగాలనేదే దీని ప్రధాన ఉద్దేశమని రేవంత్ చెప్పారు.