- బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే
- మంత్రి పొన్నం ప్రభాకర్
- పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) అన్నారు. శనివారం వారు నల్లగొండ (Nalgonda) జిల్లాలో తిప్పర్తి, మాడుగులపల్లి, నల్లగొండ పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), మంత్రి కోమటిరెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వాని దేనని అన్నారు. పేద ప్రజలకు అన్ని రకాల సేవ చేసే భాగ్యం కలగడం తమ అదృష్టమని వ్యాఖ్యానించారు.

బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.. మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు. తమ పర్యటనలో భాగంగా మంత్రులు మొదట తిప్పర్తి మండల కేంద్రంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Primary Health Centre) అదనపు హాల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అక్కడే మొక్కలు నాటారు. మాడుగుల పల్లి మండల కేంద్రంలో రూ.14.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మండల కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.
అనంతరం నల్లగొండ ఆర్టీసీ డిపోలో 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ, నకిరేకల్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.