- 10 ఏళ్ల ఘన ప్రస్థానానికి వేడుక
హైదరాబాద్: భారత సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ మూవీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా ఈ మూవీ టీమ్ రీయూనియన్ ఏర్పాటు చేసుకుంది. ఈ వేడుకలో ఎస్.ఎస్. రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ తదితరులు పాల్గొని ఒకే ఫ్రేమ్లో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
‘బాహుబలి’ ఘన విజయం తెలుగు సినిమా పరిధిని దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచానికి పరిచయం చేసింది. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, సాంకేతికత, కథన నైపుణ్యం కలిపి ‘బాహుబలి’ను ఒక తరం గుర్తుంచుకునే సినిమా చేశాయి. ‘బాహుబలి’ మొదటి భాగం 2015 జూలై 10న విడుదలై తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది.
కాగా, గురువారం (జూలై 10) ఈ మూవీకి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో మూవీ టీమ్ ప్రత్యేక రీయూనియన్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రభాస్, రాజమౌళి, రానా తదితరులు సినిమాకు గుర్తుండిపోయే ఫేమస్ డైలాగులతో ఉన్న ప్లకార్డులు పట్టుకుని అభిమానులను మరల ఆ మహత్తైన జ్ఞాపకాలలోకి తీసుకువెళ్లారు.
Baahubali10Years, #DecadeOfBaahubaliReign వంటి హ్యాష్ట్యాగ్లతో అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రీయూనియన్ అభిమానులలో మరోసారి ‘బాహుబలి’ జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది.















