హైదరాబాద్ – ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ (KTR ) సూచించారు. శాంతియుతంగా ఉండాలని బీఆర్ఎస్ (BRS ) నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఒక ప్రైవేటు ఛానల్ (TV Channel ) ప్రసారం (Telecast) చేసిన కార్యక్రమంపై ఆగ్రహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు ఆ ఛానల్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు.. దీనిపై స్పందించిన కెటిఆర్ ఇటువంటి దాడులు మంచివి కాదంటూ తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు హితవు పలికారు.. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రేవంత్రెడ్డి లాంటి నేతలు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, అబద్ధాలు, దుష్ప్రచారం అంశాలుగా సమాజంలో రోజువారి సాధారణ అంశాలుగా మారిపోతాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని సూచించారు. శాంతియుతంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కాగా, కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టుల వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు కెటిఆర్. తనపై, తమ పార్టీ నాయకత్వంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు జర్నలిస్టుల ముసుగులో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పదేపదే ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “జర్నలిస్టుల ముసుగులో కొందరు దుర్మార్గులు గత కొన్ని నెలలుగా నాపైనా, మా పార్టీ నాయకత్వంపైనా విషం చిమ్ముతున్నారు” అని ఆయన అన్నారు. ఇలాంటి వారి అభిప్రాయాలను, ఉనికిని తాను ఏమాత్రం ఖాతరు చేయనని ఆయన తేల్చి చెప్పారు.
అయితే, ఈ నిరంతర వ్యక్తిగత దూషణల వల్ల తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ సహచరులు మానసికంగా వేదనకు గురవుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే తాను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఇలాంటి రాతలు రాస్తున్న ప్రతి ఒక్కరిపై కేసులు పెడతానని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల వెనుక ఎవరున్నారనే విషయంపై కూడా కేటీఆర్ స్పందించారు. “ఈ వ్యవస్థీకృత దాడుల వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. వారిని కూడా తగిన విధంగా ఎదుర్కొంటాను” అని ఆయన స్పష్టం చేశారు.