ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ, స్పేస్ విజన్ పాలసీ–2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిందని చెప్పారు. భవిష్యత్ అనేది అంతరిక్ష రంగానిదేనని, ఈ రంగంలో ముందుగానే వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.
అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు అన్ని అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాన్ని అంతరిక్ష రంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్లే వ్యూహం
ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ముఖ్యమంత్రి అన్నారు.
లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటు కోసం ఆమోదం తెలిపిన సీఎం, విద్యాసంస్థలను పాలసీలో భాగస్వాములుగా చేస్తూ, యువతలో స్పేస్ రంగం పట్ల ఆసక్తిని పెంచాలన్నారు. టెక్నాలజీని అందుబాటులో ఉంచేందుకు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి, ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
పెట్టుబడుల ప్రోత్సాహకంగా రూ.1 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా విభిన్న స్థాయిలుగా మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా కేటగిరీలుగా పెట్టుబడులను విభజించారు. వీటి కోసం 25 శాతం నుంచి 45 శాతం వరకూ పెట్టుబడి రాయితీలు ఇచ్చే ప్రతిపాదనలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలన్న అంశంపై కూడా చర్చ సాగింది.
లేపాక్షిలో 500 ఎకరాల్లో డిజైన్, ఆర్ అండ్ డీ, స్పేస్ స్టార్ట్అప్స్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్పై ఆధారిత స్పేస్ సిటీ ఏర్పాటుకి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తిరుపతిలో మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్స్ సేవలపై దృష్టి సారించనున్నారు.