ఉమ్మడి నిజామాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా 29 తేదీన నిజామాబాద్ (Nizamabad) కు రానున్నారని, ఆయన చేతుల మీదుగా పసుపు బోర్డును గ్రాండ్ గా ఓపెనింగ్ చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ … పసుపు రైతుల ఆకాంక్ష పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. అనేక పార్టీలు హామీలు ఇచ్చారు. కానీ ఎంపీ అరవింద్ (Aravind) కృషి, ప్రధాని మోదీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పాటు చేశారన్నారు. పసుపు బోర్డుకు సంబంధించి కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్ ను ఎంపిక చేయడం గొప్ప నిర్ణయమన్నారు.
పసుపు ఎక్కువ ఉత్పతి చేసే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో బోర్డు ఏర్పాటు కోసం అడిగారని, కానీ ప్రధాని మాత్రం నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జిల్లా వాసులకు గొప్ప బహుమతి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు బిడ్ణను బోర్డు చైర్మన్ ను చేయడం గొప్ప నిర్ణయం. జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రెండు రోజుల్లో కార్యరూపం దాల్చనుందని, ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. నిజామాబాద్ రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువు.. చైతన్యానికి ప్రతీక అన్నారు. రైతు సమస్యల మీద పోరాటం గొప్పదన్నారు. రైతులతో నిజామాబాద్ పట్టణం 29న మమేకం కానుందన్నారు. కార్యాలయం ప్రారంభం, లోగో ఆవిష్కరణ (Logo invention) తర్వాత రైతుల సభను ఉద్దేశించి ప్రసంగం ఉంటుందన్నారు.
బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని భావిస్తే సీబీఐ కి ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిబిఐ చేత దర్యాప్తు చేయాలని బీజేపీ పిటిషన్ వేసిందని, సరిగా జరగని ఎడల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయినట్లు చెప్పారు. వ్యాపారులు, సినిమా వాళ్లు, మీడియా వాళ్ళను వదలకుండా అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నారు. వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదన్నారు. దేశంలో ఇంతటి దారుణం మరొకటి లేదన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.