న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిశారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్యు) భూముల సమస్యపై చర్చ జరిగింది.
గతంలో పరిశ్రమల అభివృద్ధి కోసం కేటాయించిన వేల ఎకరాల భూములు ఇప్పటికీ వినియోగంలోకి రాకుండా వదిలేయడం, లేదా వాణిజ్య, రియల్ ఎస్టేట్ ఉద్దేశాలతో వాటిని దుర్వినియోగం చేయడం రాష్ట్రానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దీనివల్ల అసలు ఉద్దేశం తప్పిపోయిందని, భూముల విలువను వాణిజ్యపరంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల పునరుద్ధరణ చేయడం లేదా ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా రాష్ట్రానికి న్యాయమైన పరిహారం చెల్లించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర హక్కులు, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడటానికి ఈ సమస్యను సకాలంలో.. సమాఖ్య దృక్పథంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.