విశాఖపట్నం : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేడు విశాఖపట్నం (Visakhapatnam) రానున్నారు. రేపు విశాఖలోని ఆర్కే బీచ్లో జరగనున్న యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే… ప్రధాని మోదీ ఈ సాయంత్రం ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసర్స్ మెస్కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu), కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి ప్రధాని తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు.
రేపు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఉదయం 6.25 గంటలకు రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్కు చేరుకుని… ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకు యోగా విన్యాసాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ భారీ యోగా ప్రదర్శనలో సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. యోగా కార్యక్రమం ముగిసిన అనంతరం మోదీ ప్రసంగిస్తారు.
యోగా కార్యక్రమం పూర్తయిన తర్వాత, ఉదయం 7.50 గంటలకు ప్రధాని ఆర్కే బీచ్ (RK Beach) నుంచి బయలుదేరి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్కు వెళతారు. అక్కడ ఉదయం 8.15 నుంచి 11.15 గంటల వరకు పలు కార్యక్రమాలను ప్రధాని కోసం రిజర్వ్ చేసి ఉంచారు. అనంతరం ఉదయం 11.25 గంటలకు ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, 11.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఈ పర్యటన సందర్భంగా ఇటీవలి పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి భార్యను ప్రధాని కలిసే అవకాశం ఉందని సమాచారం.