ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుళ్లతో దద్దరిపోతోంది. టెహ్రాన్ ప్రాంతం మొత్తం అగ్ని మేఘాలు కమ్ముకున్నాయి. ఈ దాడి ప్రత్యేకంగా టెహ్రాన్లోని లావిజాన్ ప్రాంతంపై జరిగిందని చెబుతున్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భద్రతా బంకర్ కూడా ఈ ప్రాంతంలోనే ఉందని భావిస్తున్నారు. ఆయననే లక్ష్యంగా చేసుకుని 60 యుద్ద విమానాలతో మెరుపుదాడి చేసింది ఇజ్రాయెల్. టెహ్రాన్లోని నోబోన్యాద్ స్క్వేర్ను లక్ష్యంగా చేసుకుని అక్కడ విధ్వంసకాండ సృష్టించింది.. ఇందులో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అనేక కర్మాగారాలు ఉన్నాయి. ఇరాన్ క్షిపణి, సైనిక కార్యక్రమానికి సంబంధించిన పెద్ద కర్మాగారాలు, బంకర్లు ఉన్న ప్రదేశాలు ఇవి. వాటిలో చాలా వాటిని ఈ దాడులతో నేల మట్టం చేసింది ఇజ్రాయెల్ .
అంతకుముందు, నెతన్యాహు కూడా ఒక ఇంటర్వ్యూలో ఖమేనీ మరణం తర్వాతే ఈ యుద్ధం ఆగుతుందని అన్నారు. అదే సమయంలో, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ దేశానికి తన సందేశాన్ని ఇస్తున్న సమయంలో, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహ్రాన్తో సహా అనేక ప్రదేశాలపై బాంబు దాడి చేశాయని సమాచారం. ఇజ్రాయెల్ ఎయిర్పోర్స్ టెహ్రాన్లోని లావిజాన్ ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. లావిజాన్ను ఖమేనీ రహస్య స్థావరంలో ఉన్నట్లు సమాచారం. అక్కడ బంకర్లలోనే ఆయన కుటుంబం తలదాచుకుంటున్నది..
ఇది ఇలా ఉంటే , ఖమేనీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారంలో లేదు. కానీ కొన్ని గంటల క్రితం రికార్డ్ చేసినట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నాయకుడు ఉన్న ప్రదేశం కూడా లక్ష్యంగా దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఖోజిర్, పార్చిన్ వంటి సున్నితమైన ప్రాంతాలపై కూడా దాడి జరిగింది. అటువంటి పరిస్థితిలో, ఈ వివాదం రాబోయే కొన్ని గంటల్లో మరింత తీవ్రమైన రూపాన్ని దాల్చవచ్చని భావిస్తున్నారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అనేక ప్రాంతాల్లో పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ఇంటర్నేషనల్ ప్రకారం, పౌరులు పంపిన వీడియోలు తూర్పు, పశ్చిమ టెహ్రాన్లలో పెద్ద పేలుళ్లను చూపిస్తున్నాయి. ఒక వీడియో రాజధాని తూర్పు కొండ ప్రాంతంలోని నోబోన్యాద్ ప్రాంతం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఇతర వీడియోలు తూర్పున పార్డిస్ ఫేజ్-8, పశ్చిమాన చిత్తోర్ సమీపంలోని షహ్రాక్-ఎ-ఎస్తెఘ్లాల్, గతంలో ఇంధన డిపోను లక్ష్యంగా చేసుకున్న షహ్రాన్ ప్రాంతంలో తాజా ఇజ్రాయెల్ దాడులను సూచిస్తున్నాయి. ఇది కాకుండా, ఉత్తర టెహ్రాన్లోని సియోల్ స్ట్రీట్ సమీపంలో మరో పేలుడు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల గురించి ఇరాన్ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. కానీ పౌరులలో భయం, గందరగోళం నెలకున్నాయి.
ఇరాన్ ఎదురు దాడి …
ఇరాన్ క్షిపణులతో ఎదురు దాడికి దిగింది.. ఈ దాడిలో ఇజ్రాయెల్ రాజాధాని టెల్ అవిన్ లోని స్టాక్ ఎక్స్ంజ్ తో పాటు ఒక ప్రైవేటు హాస్పిటల్ ధ్వంసమయ్యాయి . ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ తెలిపింది. ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది.
అలీ ఖమేనీని అంతంచేస్తాం ..
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించి, ఆయన పాలనకు చరమగీతం పాడతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెల్ అవీవ్ సమీపంలోని ఓ ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడి ఘటన అనంతరం ఆయన ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడిలో కనీసం 47 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ సహాయక బృందాలు నివేదించాయి.
“పిరికి నియంత ఖమేనీ తన సురక్షిత బంకర్లో దాక్కుని ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, నివాసాలపై క్షిపణులు ప్రయోగిస్తున్నాడు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం. దీనికి ఖమేనీ పూర్తి బాధ్యత వహించాల్సిందే. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖమేనీ ఇక ఎంతమాత్రం ఈ భూమ్మీద ఉండడానికి వీల్లేదు” అని కాట్జ్ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇజ్రాయెల్కు పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి, ఖమేనీ పాలనను బలహీనపరిచేందుకు టెహ్రాన్లోని ప్రభుత్వ, వ్యూహాత్మక లక్ష్యాలపై దాడుల తీవ్రతను పెంచాలని తాను, ప్రధానమంత్రి కలిసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)ను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని, సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక, గూఢచార స్థావరమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఆసుపత్రికి కేవలం పేలుడు తరంగాల ప్రభావం మాత్రమే తగిలిందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలువురు సీనియర్ ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు మరణించినట్లు, ఇరాన్లోని అణు మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా టెహ్రాన్లోని 50కి పైగా లక్ష్యాలు ధ్వంసమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరించింది. తమ దేశం ఎన్నటికీ లొంగిపోదని, బెదిరింపులకు భయపడబోమని ఖొమేనీ ఓ టెలివిజన్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులు మరింత తీవ్రమైన ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అణు విద్యుత్ కేంద్రంపై దాడికి ….
తాజాగా ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని నగర నివాసితులంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. ఇరాన్లోని అరక్, ఖోండాబ్ నగర ప్రజలకు ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. సొంత భద్రత కోసం ఆ ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరింది. ఫార్సీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఐడీఎఫ్ తెలిపింది. ఇరానియన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.
రంగంలోకి అమెరికా….
ఇదిలా ఉంటే ఈ వారాంతంలోనే అమెరికా కూడా ఇరాన్పై దాడులకు దిగొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు కూడా ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. రాబోయే రోజుల్లో ఇరాన్పై అమెరికా విరుచుకుపడొచ్చని తెలిపింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీప నగరాలను ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ చేయమని హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ సైన్యం ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో ఇరాన్ ప్రభుత్వం సేవలను నిలిపివేసింది. దీంతో దాదాపుగా 12 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు అందడం లేదు.