War Zone | ఇరాన్ కొత్త ఆర్మీ చీఫ్ ను లేపేసిన ఇజ్రాయెల్ ..

టెహ్రాన్ పై ఇజ్రాయెల్ వైమానికి దాడి …
ఎఫ్ 14 విమానాలు ధ్వంసం ..
ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ స‌న్నిహితుడు హ‌తం

ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు.. ఇరాన్ టాప్ కమాండర్ , కొత్త ఆర్మీ చీఫ్ అలీ షాద్మానీ ప్రాణాలు వదిలారు. షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ , ఇరానియన్ సాయుధ దళాలు రెండింటికీ నాయకత్వం వహించాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో షాద్మానీ చనిపోయినట్లుగా ఐడీఎఫ్ తెలిపింది. ఇతడు ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేర్కొంది. ఇక షాద్మానీ మరణవార్తపై ఇంకా ఇరాన్ స్పందించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

టెహ్రాన్‌ ఎయిర్‌పోర్ట్ పై దాడి..
తాజాగా టెహ్రాన్‌ ఎయిర్‌పోర్ట్ పై ఇజ్రాయెల్‌ భీకర దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన రెండు ఎఫ్ 14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోని ఐడీఎఫ్‌ దళాలు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాయి. ఇజ్రాయెల్‌ విమానాలను అడ్డుకునేందుకు టెహ్రాన్‌ వీటిని ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. తమ దాడిలో ఆ ఫైటర్‌ జెట్స్‌ పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించింది.

మరోవైపు, తమ లక్ష్యాలు ఇంకా పూర్తి కానందున ఇరాన్‌లోని ఆయుధాగారాల సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్‌ తాజాగా హెచ్చరించింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ గగనతలంపై తమకు పట్టు చిక్కిందని ఇజ్రాయెలీ సైన్యం ప్రకటించింది. ఏ విధమైన సవాళ్లు లేకుండా టెహ్రాన్‌ గగనతలంపై తమ యుద్ధ విమానాలు విహరించగలవని ఇజ్రాయెల్‌ తెలిపింది.

ఇజ్రాయెల్ నుంచి వచ్చేయండి – చైనా పిలుపు

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు పాల్పడుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ దాడుల వల్ల ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా గణనీయంగా జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్‌లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది.
తమ పౌరులు తక్షణమే ఇజ్రాయెల్ విడిచి వెళ్లాలని అక్కడి చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వాయు మార్గం మూసివేయబడినందున, చైనా పౌరులు జోర్డాన్ వైపు ఉన్న భూ సరిహద్దుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. పౌరుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ప‌శ్చిమా ఆసియాలో మూత ప‌డ్డ గ‌గ‌న‌త‌లాలు

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఇజ్రాయెల్ నుంచి క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉండటంతో ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో లెబనాన్, జోర్డాన్, ఇరాక్ దేశాలు కూడా విమానాల రాకపోకలను నిలిపివేశాయి. దీంతో పశ్చిమాసియా వ్యాప్తంగా విమానాశ్రయాలు మూతపడగా.. సుమారు 10,000 మందికి పైగా ప్రయాణికులు చిక్కుకుపోయారని విమానయాన భద్రతా నిపుణుడు, రిటైర్డ్ పైలట్ జాన్ కాక్స్ తెలిపారు.

టెహ్రాన్ శివార్లలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఖొమేనీలో అధికారులు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇజ్రాయెల్ కూడా తమ దేశంలోని కీలకమైన బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. ఈ పరిణామాల వల్ల సుమారు 50,000 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం.

టెహ్రాన్ లోని ఇజ్రాయెల్ డ్రోన్ కేంద్ర ద్వంసం.. ఒక‌రు బ‌హిరంగంగా ఉరి..

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. రాజధాని టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన ఒక డ్రోన్ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారులు ధ్రువీకరించినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇరాన్‌లోని పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి మొస్సాద్ ఏజెంట్లు పేలుడు పదార్థాలతో నింపిన చిన్న డ్రోన్లను మోహరించడానికి ప్రయత్నిస్తున్నారని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు కూడా తెలిపారు. ధ్వంసం చేసిన డ్రోన్ ఫ్యాక్టరీ నుంచి 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, 23 డ్రోన్లకు సంబంధించిన విడిభాగాలు, లాంచర్లు, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య మొస్సాద్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడన్న ఆరోపణలపై ఇస్మాయిల్ ఫెక్రీ అనే వ్యక్తిని నిన్న ఇరాన్ ఉరితీసింది.

Leave a Reply