వేములవాడ, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో భద్రతా చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణం బ్రిడ్జి నుండి రాజన్న ఆలయం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163(3), సెక్షన్ 144 అమలులోకి తీసుకువచ్చారు.
ఈ మేరకు 2025 జూన్ 16న ఉదయం 6గంటల నుంచి కూల్చివేతల పనులు పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. కూల్చివేతల ప్రాంతమైన ఆలయ ప్రాంగణం నుండి 100మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడడం పూర్తిగా నిషేధించబడినట్లు పేర్కొన్నారు. అధికారుల సూచన మేరకు ప్రజలు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.