విజయవాడ : వై సి పి నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు ఆయన్ని కేరళలో అరెస్ట్ చేశారు.సోమవారం ఉదయానికి నెల్లూరుకు తీసుకురానున్నారు పోలీసులు. కాగా, ఇటీవల సుప్రీంకోర్టు కూడా కాకాణి ముందస్తు బెయిల్ని తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్న అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు కాకాణి పట్టుబడటంతో అదుపులోకి తీసుకున్నారు.
రెండు నెలలుగా పరారీలో..
అక్రమ మైనింగ్ కేసులో కాకిణి గోవర్ధన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ, కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయినప్పటికీ కాకాణి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నింటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారాయన. కానీ, ఆయన ప్రయత్నాలన్నీ విఫలయత్నాలే అయ్యాయి. కాకాణి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన దారులన్నీ మూసుకుపోయాయి. మరోవైపు రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణి జాడ కనిపెట్టేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే.. కాకాణి కేరళలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయన ఉన్న ప్లేస్కి వెళ్లిన పోలీసులు.. కాకాణిని అదుపులోకి తీసుకున్నారు.