అంతర్జాతీయ అణుశక్తి సంస్థను కోరిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
“ఆపరేషన్ సిందూర్” అనంతరం చేపట్టిన శ్రీనగర్ పర్యటన
పహాల్గాం మృతులకు సంతాపం
శ్రీనగర్ ఆర్మీ శిబిరంలోని జవాన్లతో మాటా మంతి
ఉగ్రవాద పోరులో మీ పోరాటం ప్రశంసనీయమన్న రక్షణ మంత్రి
శ్రీనగర్ – బాధ్యాతారాహిత్యంగా ఉండే పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయా..? అని కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రపంచాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పాక్ నుంచి అణ్వాయుధాలను తీసుకొని పర్యవేక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
నేటి ఉదయం జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో రాజ్ నాథ్ పర్యటించారు. ఆయనకు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్వాగతం పలికారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం ఆయన చేపట్టిన తొలి పర్యటన ఇది. ఈ పర్యటనలో రక్షణ మంత్రి భారత సాయుధ దళాల సిద్ధతను సమీక్షించారు. పాక్ సరిహద్దుల్లో పడిన షెల్స్ను పరిశీలించారు. అనంతరం శ్రీనగర్ లోని ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి జవాన్లతో ముచ్చటించారు.

ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్ర శిబిరాలు ఎక్కడ ఉన్నా నాశనం చేస్తామని చెప్పారు. టెర్రరిస్టులతో పోరాడి ప్రాణత్యాగాలు చేసిన జవాన్లకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని.. అదొక కమిట్మెంట్ అని పేర్కొన్నారు.
భారత్ పై ఉగ్రదాడి జరిగితే.. దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామన్నారు. మన దళాలు అద్భుతంగా పోరాడుతున్నాయని పేర్కొన్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారి మధ్య ఉన్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు ఆయన నివాళులర్పించారు. ఉగ్రవాద పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నేను వందనం చేస్తున్నానని అన్నారు.. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకూ నివాళులు అర్పిస్తున్నానని అంటూ గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ను “భారత వైమానిక దళాల అతిపెద్ద ప్రతీకార చర్య”గా అభివర్ణించిన రాజనాథ్ సింగ్, ఉగ్రవాదాన్ని నివారించేందుకు అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవాదులను అక్కడ అడ్డుకోవాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఆపాలని ఆయన పేర్కొన్నారు.